తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో కొన్ని జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారం పూర్తిగా తప్పుడు దుష్ప్రచారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అనుమతి, శాసనసభ చర్చ లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని హామీ ఇచ్చారు.
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. ఏ జిల్లాను రద్దు చేయాలనే ఆలోచన గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి పీక్స్లో… అక్కడ అందరి ఇళ్లలో కొత్త టీవీలు, ఫ్రిజ్లు ..
సీఎం పూర్తి క్లారిటీ..
ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం ఖండించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమైతే ప్రజలకు బహిరంగంగా తెలియజేసి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా భూపాలపల్లి ప్రజలు చైతన్యవంతులని, తప్పుడు ప్రచారాలను గుర్తించే శక్తి వారికి ఉందని పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.
సింగరేణి మెడికల్ బోర్డు రద్దు అంశంపై వస్తున్న వార్తలను కూడా సీఎం తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలు ఉన్నాయని, వారి ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు. కార్మికుల ఉపాధి, వారసత్వ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. సింగరేణి కార్మికులే ఈ ప్రభుత్వానికి బలమని, వారి సంక్షేమమే తమ ప్రాధాన్యమని తెలిపారు.
సమ్మక్క-సారలమ్మ జాతర దక్షిణ కుంభమేళాగా..
2027లో నిర్వహించబోయే పుష్కరాలపై మాట్లాడిన సీఎం, గోదావరి పరీవాహక ప్రాంతంలో బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలను పర్యాటక పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులు నిర్మించి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. సరస్వతి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని, సమ్మక్క–సారలమ్మ జాతరను దక్షిణ కుంభమేళాగా తీర్చిదిద్దినట్టు గుర్తుచేశారు. మేడారం జాతరకు రెండు కోట్ల మంది భక్తులు హాజరయ్యారని చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి పనుల కోసం రూ.6,116 కోట్లు కేటాయించినట్టు సీఎం వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా ప్రజలతో పాటు కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర విశేషమని కొనియాడారు.