నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. ₹9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో సుమారు ₹9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనే భారీ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.
వరంగల్లో PM MITRA పార్క్ ప్రారంభం
తెలంగాణ టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చే విధంగా వరంగల్లో ఏర్పాటు చేసిన PM MITRA పార్క్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్గా అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టు సుమారు ₹1,700 కోట్ల వ్యయంతో రూపొందింది. ఇది దేశంలో పూర్తిస్థాయిలో పనిచేయనున్న తొలి PM MITRA పార్క్ కావడం విశేషం.

జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకు శంకుస్థాపన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో హైదరాబాద్నా-గ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ ఏరియాకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సుమారు ₹2,350 కోట్ల వ్యయంతో 3,245 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు కలుగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మహబూబ్నగర్ NH-167 ఫోర్లేన్ పనులకు ప్రారంభం
హైదరాబాద్ప-నాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గూడబెల్లూరు నుంచి మహబూబ్నగర్ వరకు NH-167ను నాలుగు లైన్ల రహదారిగా విస్తరించే పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం ₹3,175 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. దీని వల్ల తెలంగాణ–కర్ణాటక మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
హైదరాబాద్లో ఇండియన్ ఆయిల్ మల్కాపూర్ టెర్మినల్ ప్రారంభం
హైదరాబాద్లో ఇండియన్ ఆయిల్ సంస్థ ఏర్పాటు చేసిన మల్కాపూర్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ₹600 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రాంతీయ ఇంధన అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

సింధు హాస్పిటల్ను జాతికి అంకితం
హైదరాబాద్లో నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి ‘సింధు హాస్పిటల్’ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 1,500 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని
తెలంగాణ పర్యటనకు ముందు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో కూడా ఆయన హాజరవుతారు.


