మల్కాపూర్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధం.. హైదరాబాద్‌కు ఇంధన భద్రత బలోపేతం

పారాదీప్-హైదరాబాద్ పైప్‌లైన్ ద్వారా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాకు కీలకమైన మల్కాపూర్ టెర్మినల్‌ను మే 10న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

మల్కాపూర్ టెర్మినల్ పెట్రోలియం ప్రాజెక్ట్
మల్కాపూర్ టెర్మినల్ పెట్రోలియం ప్రాజెక్ట్

తెలంగాణలో ఇంధన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. పారాదీప్-హైదరాబాద్ పైప్‌లైన్ ద్వారా పెట్రోలియం ఉత్పత్తుల స్వీకరణ కోసం నిర్మించిన ఈ టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మే 10, 2026న వర్చువల్‌గా దేశానికి అంకితం చేయనున్నారు.

హైదరాబాద్ నుంచి వర్చువల్ కార్యక్రమం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఇంధన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.

సుమారు రూ.611 కోట్ల వ్యయంతో ఈ టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. దాదాపు 89 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మొత్తం 1,65,000 కిలోలీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇందులో పెట్రోల్ (MS) కోసం 60,000 KL, డీజిల్ (HSD) కోసం 68,000 KL, విమాన ఇంధనం (ATF) కోసం 26,000 KL మరియు ఇతర ఉత్పత్తుల కోసం 11,000 KL నిల్వ సామర్థ్యం ఉంది.

అలాగే ట్యాంకర్ లారీ లోడింగ్ కోసం అత్యాధునిక 2×8 బే ట్యాంకర్ లోడింగ్ ఫెసిలిటీని బాటమ్ లోడింగ్ సిస్టమ్‌తో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇంధన పంపిణీ వేగవంతం కావడంతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడనున్నాయి.

ఇప్పటి వరకు రైల్వే ఆధారిత ఇంధన రవాణా వ్యవస్థపై ఆధారపడిన ప్రాంతానికి ఇకపై నేరుగా పైప్‌లైన్ ద్వారా సరఫరా జరగనుంది. దీని వల్ల ఇంధన లాజిస్టిక్స్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్పు వల్ల దాదాపు 10 వేల KL హైస్పీడ్ డీజిల్ ఆదా కావడంతో పాటు సుమారు 27 వేల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.

ప్రాజెక్టు నిర్మాణ దశలోనే వందలాది మందికి ఉపాధి లభించగా, భవిష్యత్తులో కూడా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పరిశ్రమలు, రవాణా, విమానయాన రంగాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంధన అవసరాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పైప్‌లైన్ ఆధారిత సరఫరా వ్యవస్థ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా రవాణా ఖర్చులు తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. పర్యావరణ పరిరక్షణ కోణంలో కూడా కార్బన్ ఉద్గారాల తగ్గుదలకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది.

Also Read : తెలంగాణ రైలు ప్రయాణం వేగవంతం – కాజీపేట-విజయవాడ కారిడార్‌కు మే 10న మోదీ శంకుస్థాపన

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »