పోలీస్ వాహనాల నిర్వహణను పరిశీలించిన కమిషనర్, అత్యవసర సమయాల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి వాహనాల్లో కచ్చితమైన కిట్లు ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, బలమైన తాళ్లు, ట్రాఫిక్ కోన్స్, క్రైమ్ ప్రొటెక్షన్ రిబ్బన్ మరియు రైట్ గేర్ కిట్ (హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ప్రొటెక్టర్) తప్పనిసరిగా ఉంచుకోవాలని ఆదేశించారు.
కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును స్వయంగా పరీక్షించేందుకు ఆయన కమ్యూనికేషన్ సెట్ ద్వారా కంట్రోల్ రూమ్ సిబ్బందితో మాట్లాడారు. సమాచారం అందినప్పుడు సిబ్బంది అప్రమత్తత, స్పందన సమయం (రెస్పాన్స్ టైమ్) తక్కువగా ఉండాలని సూచించారు. స్టేషన్కు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, పాత నేరస్థుల వివరాలు, పెండింగ్ కేసుల స్థితిగతులను ఎస్ఐ, సీఐలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి విధులు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు.
గిరిజనుల పట్ల సున్నితంగా ఉండాలి.. డిజిటల్ సేవలను చేర్చాలి
మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తారమైన గ్రామీణ, గిరిజన ప్రాంతాలు ఉన్నందున, ఇక్కడి ప్రజలతో పోలీసులు వ్యవహరించే తీరు చాలా ముఖ్యం అని సీపీ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల ప్రజలతో సున్నితంగా, ఆప్యాయంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓపికగా విని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. దీనివల్ల పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. పోలీస్ శాఖ అందిస్తున్న డిజిటల్ సేవలు, సీసీటీఎన్ఎస్, హాక్ ఐ (HawkEye), టీఎస్ కాప్ (TSCop) వంటి మొబైల్ యాప్లను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్, వివిధ ధ్రువపత్రాల జారీ, ఆన్లైన్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ వంటి సేవలను గిరిజన ప్రజలకు వివరించాలని చెప్పారు.
గంజాయి నివారణ.. కమ్యూనిటీ పోలీసింగ్కు ప్రాధాన్యం
యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను సీపీ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, యువతతో పాటు తల్లిదండ్రులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై నిరంతరం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మహిళల భద్రతకు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.
ప్రాంతాల్లో భద్రతను పెంపొందించడానికి సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలను చైతన్యపరచాలన్నారు.
ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు కార్యాచరణ సిద్ధం
వర్షాకాలం నేపథ్యంలో భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేందుకు వీలుగా ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్’ (ముందస్తు కార్యాచరణ ప్రణాళిక) సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను హెచ్చరించారు. స్థానిక ఎస్ఐలు తమ పరిధిలో నిరంతరం విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టి నేరాల నియంత్రణతో పాటు ముందస్తు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించాలని స్పష్టం చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఇతర పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మాదారం పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ ఎస్ఐ, సీఐతో పాటు స్టేషన్ సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: HSBC Hyderabad: హెచ్ఎస్బీసీ హైదరాబాద్ లీజ్ డీల్.. గచ్చిబౌలి ఫినిక్స్ H09లో కమర్షియల్ స్పేస్ లీజ్


