Petrol Price Hike | పెట్రోల్ ధరల మోత మోగుతోంది. ఇప్పటికే మూడుసార్లు ధరలను పెంచిన చమురు కంపెనీలు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్పై లీటరుకు రూ.2.61, డీజిల్పై రూ.2.71 పెంచుతున్నట్లుగా ప్రకటించాయి. గత 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. వరుస పెరుగుదలలతో సామాన్య ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12కు, డీజిల్ ధర రూ.95.20కు చేరింది. ఇదివరకే శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను 87 నుంచి 91 పైసల వరకు పెంచిన విషయం తెలిసిందే.
Read Also : అమరావతిలోకి మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. క్వాంటమ్ వ్యాలీ లాబోరేటరీని నెలకొల్పనున్న డీఆర్డీవో..!
ఎందుకు పెరుగుతున్నాయి?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీనపడడం, దిగుమతి వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో చమురు సంస్థలపై ఒత్తిడి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అదనంగా రిఫైనింగ్ మార్జిన్లలో మార్పులు కూడా ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చాలా కాలంగా ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు ఇప్పుడు పెరిగిన వ్యయాన్ని దశలవారీగా వినియోగదారులపై మోపుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గడిచిన పదిరోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలపు దాదాపు రూ.5 వరకు పెంచుతూ భారం మోపాయి.
Read Also : ఆధార్ యూజర్లకు గుడ్న్యూస్.. అప్డేట్ గడువును మరో ఏడాది పొడిగించిన ఉడాయ్..!
ఎక్కడ ఎంత పెరిగిందంటే..?
పెరిగిన ధరలల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.2.61 పెరిగి రూ.102.12కు చేరింది. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.113.51, ముంబయిలో రూ.111.21గా ఉండగా, చెన్నైలో రూ.107.77కి చేరుకుంది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.115.58, ఏపీ విజయవాడలో రూ.117.17కి చేరుకుంది. డీజిల్ ధర లీటర్కు ఢిల్లీలో రూ.95.20కి చేరుకుంది. కోల్కతాలో డీజిల్ రూ.99.82, ముంబయిలో రూ.97.83కి చేరగా.. విజయవాడలో రూ.104.88, హైదరాబాద్లో 103.74కి ఎగిసింది. ప్రభావం రవాణా, సరుకు రవాణా రంగాలపై మరింతగా పడే అవకాశముంది. దీంతో మార్కెట్లో సరుకుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రవాణా వ్యయాలు పెరగడంతో పండ్లు, కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డీజిల్ ధరల పెంపుతో వ్యవసాయ, రవాణా రంగాలపై అదనపు భారం పడనుంది. ఫలితంగా వచ్చే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : తెలంగాణలో భానుడి భగభగలు.. రెండురోజుల్లో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. ఐఎండీ రెడ్ అలర్ట్..!


