UIDAI | ఆధార్ యూజర్లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరోసారి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. ఆధార్లో వ్యక్తిగత వివరాలు, డాక్యుమెంట్లను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఉచిత సర్వీసులు ముగిసిపోగా.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో గడువును ఉడాయ్ పొడగిస్తూ వస్తోంది. తాజా నిర్ణయం ప్రకారం ‘మైఆధార్’ (myAadhaar) పోర్టల్ ద్వారా 2027 జూన్ 14 వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన అధికారిక మెమోరాంలో యూఐడీఏఐ స్పష్టత ఇచ్చింది. 2026 జూన్ 15 నుంచి 2027 జూన్ 14 వరకు ఈ సదుపాయం కొనసాగుతుందని తెలిపింది. ప్రజలు తమ ఆధార్లోని వివరాలను అప్డేట్ చేసుకులా ప్రోత్సహించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని చెప్పింది.
ఆధార్ యాప్లోనూ కీలక మార్పులు
డాక్యుమెంట్ అప్డేట్ సేవలతో పాటు మొబైల్ యాప్ వ్యవస్థలో కూడా యూఐడీఏఐ మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న ‘mAadhaar’ యాప్ను దశలవారీగా నిలిపివేసి, దాని స్థానంలో కొత్త ‘Aadhaar App’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన యూఐడీఏఐ, కొత్త యాప్లో భద్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపింది. ముఖ్యంగా సెక్యూర్ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ కంట్రోల్స్, ఆధార్కు సంబంధించిన పలు సేవలను సులభంగా పొందే విధంగా కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. కొత్త ఆధార్ యాప్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రారంభించిన కేవలం మూడు నెలల్లోనే ఈ యాప్ను 2.1 కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించింది.
Read Also : Uidai Internship 2026 : ఆధార్ సెంటర్లో ఇంటర్న్షిప్.. నెలకు ₹40 వేల స్టైపెండ్! వివరాలు ఇవే..
యాప్కు మంచి రెస్పాన్స్..
ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 28 లక్షల మంది తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా, దాదాపు 6 లక్షల మంది అడ్రస్లో మార్పులు చేసుకున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్న ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ సేవలను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రజలకు మరింత ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. యాప్ సేవలను యూజర్లు వినియోగించుకోవాలని ఉడాయ్ కోరింది.
Read Also : థ్యాంక్స్ సీఎం రేవంత్..! సీఎం రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్ పాలాభిషేకం..!


