టీవీ ఛానళ్లకు గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్? కొత్త TRP పాలసీపై చర్చ

ల్యాండింగ్ పేజ్ వ్యూయర్‌షిప్‌కు బ్రేక్, డ్యూయల్ ఆడిట్ సిస్టమ్ తప్పనిసరి డేటా భద్రత, నిష్పక్షపాత కొలతలకు కొత్త మార్గదర్శకాలు

TRP Policy 2026
TRP Policy 2026

టెలివిజన్ ప్రేక్షకుల కొలత వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) తాజాగా ‘టీవీ రేటింగ్ పాలసీ 2026’ను ప్రకటించింది. ఈ కొత్త పాలసీ ద్వారా టీఆర్‌పీ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయడం, డేటా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటి వరకు టీవీ రేటింగ్స్‌పై వచ్చిన విమర్శలు, మానిప్యులేషన్ ఆరోపణల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు తీసుకురావడం గమనార్హం. కొత్త పాలసీ ప్రకారం రేటింగ్ ఏజెన్సీల నమోదు, కార్యకలాపాలు, ఆడిట్ విధానాలు అన్నింటిపై స్పష్టమైన నియంత్రణలు విధించబడతాయి.

ఎంట్రీ నార్మ్స్ సడలింపు

టీవీ రేటింగ్ ఏజెన్సీలుగా నమోదు కావాలనుకునే సంస్థలకు పెద్ద ఊరట లభించింది. గతంలో రూ.20 కోట్ల నెట్‌వర్త్ అవసరం ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.5 కోట్లకు తగ్గించారు. దీని వల్ల కొత్త కంపెనీలకు అవకాశాలు పెరగనున్నాయి.

నిష్పక్షపాతానికి కఠిన నిబంధనలు

ఏజెన్సీల బోర్డ్‌లో కనీసం 50% మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉండాలి. వారు బ్రాడ్‌కాస్టర్లు, అడ్వర్టైజర్లు లేదా ఏజెన్సీలతో సంబంధం ఉండకూడదు. అలాగే కన్సల్టెన్సీ సేవలు ఇవ్వడం నిషేధించబడింది.

డేటా ఖచ్చితత్వం కోసం పెద్ద నమూనా

డేటా ఖచ్చితత్వాన్ని పెంచేందుకు 80,000 మీటర్డ్ హోమ్‌లకు విస్తరించాలి. తదుపరి దశలో ఇది 1,20,000 ఇళ్లకు పెంచాలని నిర్ణయించారు. కేబుల్, DTH, OTT, స్మార్ట్ టీవీలు అన్నింటినీ కలిపి డేటా సేకరణ జరుగుతుంది.

ల్యాండింగ్ పేజ్‌కు కట్టడి

టీవీ ఛానల్ ల్యాండింగ్ పేజ్ ద్వారా వచ్చే వ్యూయర్‌షిప్‌ను ఇకపై TRPలో పరిగణించరు. దీన్ని కేవలం మార్కెటింగ్ టూల్‌గా మాత్రమే ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు.

పారదర్శకత & డేటా భద్రత

రేటింగ్ ఏజెన్సీలు తమ డేటా సేకరణ విధానాన్ని ప్రజలకు వెల్లడించాలి. అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం 2023 ప్రకారం వినియోగదారుల గోప్యతను కాపాడాల్సి ఉంటుంది.

డ్యూయల్ ఆడిట్ సిస్టమ్

కొత్త పాలసీలో ముఖ్యంగా డ్యూయల్ ఆడిట్ విధానం ప్రవేశపెట్టారు. త్రైమాసికంగా ఇంటర్నల్ ఆడిట్, ఏడాదికి ఒకసారి ఎక్స్‌టర్నల్ ఆడిట్ తప్పనిసరి చేశారు. అదనంగా మంత్రిత్వ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయనుంది.

ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ

ప్రతి ఏజెన్సీ ఒక నోడల్ అధికారిని నియమించి, ఫిర్యాదులను 10 రోజుల్లో పరిష్కరించాలి. అలాగే అప్పీల్ కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలి.

నిబంధనలు పాటించకపోతే చర్యలు

పాలసీ ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకోనున్నారు. మొదట తాత్కాలిక సస్పెన్షన్ నుంచి, పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు వరకు చర్యలు ఉంటాయి.

టీవీ రేటింగ్స్ ఆధారంగా ప్రకటనల ఆదాయం, ఛానళ్ల విజయాలు నిర్ణయించబడతాయి. కాబట్టి TRPలో పారదర్శకత లేకపోతే మొత్తం మీడియా రంగం ప్రభావితం అవుతుంది. ఈ కొత్త పాలసీ వల్ల ప్రేక్షకుల నిజమైన అభిరుచులు ప్రతిబింబించే అవకాశముంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టెలివిజన్ పరిశ్రమలో నమ్మకాన్ని పెంచే కీలక అడుగుగా భావిస్తున్నారు.

Also Read: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై సీఎంలతో ప్రధాని సమావేశం .. దేశ భద్రత, ఇంధన సరఫరాపై కీలక చర్చలు

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »