పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్కు కఠిన డెడ్లైన్ విధించగా, టెహ్రాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తూ తన షరతులను స్పష్టంగా వెల్లడించింది.
అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. దీని బదులుగా యుద్ధానికి శాశ్వత ముగింపు కోసం 10 కఠిన నిబంధనలతో కూడిన ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. ఈ ప్రతిపాదనలో భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ ఇవ్వడం నుంచి ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వరకు కీలక అంశాలు ఉన్నాయి.
ఇరాన్ పెట్టిన ప్రధాన డిమాండ్లు
ఇరాన్ స్పష్టం చేసిన షరతులలో ముఖ్యంగా అమెరికా మరియు దాని మిత్రదేశాలు ఇకపై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి, అన్ని ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి, అలాగే యుద్ధాన్ని పూర్తిగా ముగించాలి అనే అంశాలు ఉన్నాయి. అదనంగా హెజ్బొల్లా వంటి తమ మిత్రపక్షాలపై దాడులను ఆపాలని కూడా డిమాండ్ చేసింది.
Also Read: పనామా బ్రిడ్జ్పై భారీ పేలుడు … కెనాల్ రవాణాపై ప్రభావం, ఆందోళన చెందుతున్న అమెరికా
హోర్ముజ్ జలసంధి కీలకం
ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రైయిట్ ఆఫ్ హర్మూజ్ పై కూడా ఇరాన్ స్పష్టమైన షరతులు పెట్టింది. శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితేనే ఈ మార్గాన్ని తిరిగి తెరవాలని పేర్కొంది. అంతేకాకుండా, ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రతి నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్ల రుసుము వసూలు చేసి, ఆ ఆదాయాన్ని ఒమన్తో పంచుకుంటామని తెలిపింది.
ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్ ప్రతిపాదనపై స్పందించిన ట్రంప్, దీన్ని “ఒక ముఖ్యమైన అడుగు”గా పేర్కొన్నప్పటికీ, ఇది పూర్తిగా సరిపోదని వ్యాఖ్యానించారు. నిర్ణీత గడువులో తుది నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైన దాడులు జరుగుతాయని హెచ్చరించారు.
మధ్యవర్తిత్వ ప్రయత్నాలు
ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చాయి. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశముండటంతో, ఆర్థిక రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు.
ప్రస్తుతం పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు యుద్ధంగా మారుతాయా? లేక మధ్యవర్తిత్వంతో పరిష్కారం దొరుకుతుందా? అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.


