భారత్‌లో కలవరపెడుతున్న విడాకులు కేసులు… తెలుగు రాష్ట్రాలు టాప్ జాబితాలో!

దేశవ్యాప్తంగా గత ఏడాది 8.27 లక్షల విడాకుల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ కూడా టాప్ రాష్ట్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. పెళ్లయిన మూడు సంవత్సరాల్లోనే ఎక్కువ శాతం కాపురాలు కూలిపోతున్నాయన్న గణాంకాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.

AI-generated symbolic image representing rising divorce cases in India
Image Source: AI-generated (OpenAI)

ఒకప్పుడు “పెళ్లంటే నూరేళ్ల పంట” అనే మాట ప్రతి ఇంట్లో వినిపించేది. వివాహ బంధాన్ని పవిత్రంగా భావించే భారతీయ సమాజంలో విడాకులు అరుదైన ఘటనగా ఉండేవి. అయితే కాలం మారింది… ఆలోచనా విధానాలు మారాయి… జీవన శైలులు మారాయి. ఈ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విడాకుల కేసులు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

లక్షల్లో విడాకుల కేసులు… పరిస్థితి మ‌రింత‌ సీరియస్?

గత ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 8.27 లక్షల విడాకుల కేసులు నమోదు కావడం గమనార్హం. ఇది గతంతో పోలిస్తే భారత్‌లో భారీ పెరుగుదలగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రాల వారీగా చూస్తే:

  • మహారాష్ట్ర – 18.7% కేసులతో అగ్రస్థానం
  • కర్ణాటక – 11.7% కేసులతో రెండో స్థానం
  • తెలంగాణ – 6.7% కేసులతో టాప్-6 రాష్ట్రాల్లో స్థానం

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో విడాకుల సంఖ్య వేగంగా పెరుగుతోందని న్యాయవాదులు, కుటుంబ సలహాదారులు చెబుతున్నారు. ఒకప్పుడు కుటుంబ పెద్దల జోక్యంతో పరిష్కరించుకునే సమస్యలు, ఇప్పుడు నేరుగా కోర్టు గడపను తట్టుతున్నాయి.

Also Read: రైల్వే మంత్రి బిగ్ అనౌన్స్‌మెంట్ — స్పెషల్ నుంచి రెగ్యులర్‌గా మారిన 9 రైళ్లు, ప్రయాణికులకు టికెట్ రేట్లు తగ్గాయి!

విడాకులు తీసుకుంటున్న వారిలో సుమారు 33.2% మంది పరస్పర అంగీకారంతో విడిపోతున్నారు. అయితే మిగిలిన కేసులు తీవ్ర కారణాలతో కోర్టుకు చేరుతున్నాయి.

ప్రధాన కారణాలు:

  • గృహహింస
  • క్రూరత్వం
  • వివాహేతర సంబంధాలు
  • ఆర్థిక, వ్యక్తిగత విభేదాలు

వీట‌న్నిటికంటే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, దాదాపు 40% వివాహాలు పెళ్లయిన మొదటి మూడు సంవత్సరాల్లోనే ముగిసిపోతున్నాయి. ఓపికలేమి, చిన్న చిన్న విషయాలపై పెద్ద గొడవలు, పరస్పర అవగాహన లోపం ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మహిళల ఆర్థిక స్వతంత్రత..

గతంతో పోలిస్తే మహిళల్లో ఆర్థిక స్వతంత్రత గణనీయంగా పెరిగింది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్వయం సమర్థత సాధిస్తున్న మహిళలు… అగౌరవం, వేధింపులు ఉన్న చోట ఉండటానికి సిద్ధంగా లేరు.

మునుపటిలా పరిస్థితులను భరించకుండా, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని భావిస్తూ విడాకుల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఒకవైపు మహిళా సాధికారతకు సంకేతమైతే, మరోవైపు కుటుంబ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పురుషుల ధోరణి కూడా మారాల్సిందేనా?

ఇంకొకవైపు పురుషాధిక్యత భావాలు, ఈగోలు, అత్తమామల జోక్యం వంటి అంశాలు కూడా సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, సంభాషణ లోపం సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం,

  • ఓపిక
  • పరస్పర అవగాహన
  • కుటుంబ సలహా సేవలు
  • పిల్లల భవిష్యత్తు పట్ల బాధ్యత

ఇవి ఉంటే కాపురాలు కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

మొత్తానికి, విడాకులు పెరుగుతుండ‌డం ఒక సామాజిక మార్పుకు సంకేతం. ఇది కేవలం సంఖ్యల విషయం కాదు… కుటుంబ వ్యవస్థ, పిల్లల భవిష్యత్తు, సామాజిక నిర్మాణంపై ప్రభావం చూపే అంశం. అటు మహిళలు, ఇటు పురుషులు పరస్పర గౌరవంతో ముందడుగు వేస్తేనే పచ్చని కాపురాలు నిండు నూరేళ్లు నిలుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »