అమెరికాలో గన్ కల్చర్ మరోసారి భయానక రూపం దాల్చింది. లూసియానా రాష్ట్రంలోని ష్రెవ్పోర్ట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో 8 మంది చిన్నారులు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, గుర్తుతెలియని ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో 1 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదనంగా మరో ఇద్దరు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గతంలో ఎప్పుడు చూడలేదు..
ఈ ఘటనపై స్పందించిన ష్రెవ్పోర్ట్ పోలీస్ చీఫ్ వేన్ స్మిత్, “ఇది చాలా ఘోరమైన ఘటన. మనలో చాలామంది ఇలాంటి సంఘటనను గతంలో చూడలేదు” అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన పిల్లల్లో కొందరు దుండగుడికి బంధువులేనని ఆయన వెల్లడించారు. కాల్పుల అనంతరం నిందితుడిని పోలీసులు గుర్తించి ఎదురుకాల్పుల్లో హతమార్చినట్లు సమాచారం. అయితే ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇక ఈ కేసులో సహకరించాలని ష్రెవ్పోర్ట్ పోలీసులు రాష్ట్ర పోలీసులను కోరారు. బోసియర్ సిటీలో జరిగిన ఛేదనలో ఎలాంటి పోలీసు సిబ్బందికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు ఉంటే తమ డిటెక్టివ్లకు అందించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.ఈ దారుణ ఘటన అమెరికాలో పెరుగుతున్న గన్ హింసపై మరోసారి ఆందోళనలను రేకెత్తిస్తోంది. చిన్నారులే లక్ష్యంగా మారడం సమాజాన్ని కలచివేస్తోంది. ఇక ఈ ఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read: