నాసిక్ టీసీఎస్ బీపీఓ వేధింపుల కేసు కలకలం… రంగంలోకి ఎన్‌సీడబ్ల్యూ, ప్రత్యేక విచారణ కమిటీ

మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్ల ఆరోపణలతో నాసిక్ టీసీఎస్ బీపీఓ యూనిట్‌పై తీవ్ర వివాదం రేగింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

TCS Nashik controversy
TCS Nashik controversy

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బీపీఓ యూనిట్‌లో మహిళా ఉద్యోగులపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ (NCW) క్షేత్రస్థాయి విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది.

కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సాధనా జాదవ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. హర్యానా మాజీ డీజీపీ బి.కె. సిన్హా, సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోరా, ఎన్‌సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ లీలావతి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఏప్రిల్ 18న నాసిక్‌ను సందర్శించి బాధితులు, పోలీసులు, సంస్థ ప్రతినిధులతో మాట్లాడి వాస్తవాలను సేకరించనుంది. విచారణ పూర్తయిన 10 పని దినాల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

వేధింపుల ఆరోపణలు, అరెస్టులు:

బాధితుల వాంగ్మూలాల ప్రకారం, ఉద్యోగులపై వివాహం పేరుతో మోసం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులు చేయడం, అలాగే మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి 2026 మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు 8 మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి ఫిర్యాదులు నమోదు చేయగా, పోలీసులు కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తార్‌లతో పాటు టీసీఎస్ ఆపరేషన్స్ హెడ్ అశ్విని చైనానీని కూడా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను పోలీస్ కస్టడీకి తరలించారు.

టాటా గ్రూప్ స్పందన

ఈ ఘటనలపై ఎన్. చంద్రశేఖరన్ తీవ్రంగా స్పందించారు. నాసిక్ యూనిట్‌లో జరిగిన ఘటనలు బాధాకరమని, సంస్థ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని తెలిపారు. నిందితులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని చెప్పారు. అలాగే టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తి సుబ్రమణ్యన్ నేతృత్వంలో అంతర్గత విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

ఇతర ఐటీ కంపెనీల్లోనూ అలజడి

ఈ ఘటనల మధ్య పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలోనూ ఇలాంటి వేధింపుల ఆరోపణలు రావడం ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, స్వతంత్ర కమిటీతో విచారణ జరుపుతున్నామని సంస్థ యాజమాన్యం తెలిపింది.

ఇక నాసిక్ ఘటనలను నిరసిస్తూ భజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఘటనల వెనుక ‘లవ్ జిహాద్’ కోణం ఉందని విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఘటనతో ఐటీ రంగంలో ఉద్యోగుల భద్రత, కార్యాలయాల్లో లింగ సమానత్వం, నైతిక విలువలపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. విచారణ కమిటీ నివేదిక తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read:

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »