డెబ్యూ మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ప్రఫుల్ హింగే.. రాజస్థాన్‌ను కుదేలు చేసిన ఈ డైన‌మైట్ ఎవ‌రు?

ఐపీఎల్ అరంగేట్రంలోనే తొలి ఓవర్‌లో మూడు వికెట్లు తీసి సంచలనం సృష్టించిన ప్రఫుల్ హింగే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చి మ్యాచ్‌ను త‌మ‌వైపుకి తిప్పాడు.

SRH bowler Praful Hinge celebrating after taking a wicket against Rajasthan Royals in IPL 2026.
SRH bowler Praful Hinge celebrating after taking a wicket against Rajasthan Royals in IPL 2026.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా నాలుగు విజయాలతో జోరుమీద ఉన్న రాజస్థాన్ జట్టును పూర్తిగా క‌ట్ట‌డి చేసింది. ఈ విజయానికి ప్రధాన కారణం డెబ్యూ ప్లేయర్ ప్రఫుల్ హింగే అద్భుత బౌలింగ్.

217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్‌కు మొదటి ఓవర్ నుంచే షాక్ తగిలింది. బంతిని అందుకున్న ప్రఫుల్ హింగే మ్యాచ్‌ను పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు. రెండో బంతికే ప్రమాదకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీను గోల్డెన్ డక్‌గా ఔట్ చేశాడు. హార్డ్ లెంగ్త్ బాల్‌ను అంచనా వేయలేక గాల్లోకి లేపిన షాట్‌ను వికెట్ కీపర్ సులభంగా పట్టుకున్నాడు.

వ‌రుస వికెట్స్..

ఈ వికెట్‌తో ఉత్సాహంలోకి వచ్చిన సన్‌రైజర్స్ జట్టు, అదే ఓవర్‌లో మరింత ప్రభంజనం సృష్టించింది. నాలుగో బంతికి ధ్రువ్ జురెల్ను డకౌట్ చేసిన హింగే, ఓవర్ చివరి బంతికి లూయాన్-డ్రే ప్రిటోరియస్ను కూడా పెవిలియన్ పంపించాడు. దీంతో తొలి ఓవర్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కుదేలైంది.

తర్వాతి ఓవర్‌లో సకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో యశస్వి జైశ్వాల్ ఔట్ కాగా, మూడో ఓవర్‌లో మళ్లీ హింగే బౌలింగ్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో కేవలం మూడు ఓవర్లలోనే 9 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ పూర్తిగా కష్టాల‌లో ప‌డింది.

తొలి మ్యాచ్‌లోనే అవార్డ్..

మొత్తంగా 2 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన ప్రఫుల్ హింగే, మిగతా ఓవర్లలో కొంత పరుగులు ఇచ్చినా మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించాడు. అతని ఈ అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ప్రఫుల్ హింగే(Praful Hinge) ఎవరు?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ హింగే, దేశవాళీ క్రికెట్‌లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 24 ఏళ్ల ఈ యువ పేసర్‌ను ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ వంటి అనుభవజ్ఞుల స్థానంలో అవకాశం దక్కించుకున్న హింగే, తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు.

2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసిన హింగే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 మ్యాచ్‌లలో 27 వికెట్లు సాధించాడు. వికెట్ టు వికెట్ బౌలింగ్‌లో నైపుణ్యం కలిగిన ఈ పేసర్ భవిష్యత్తులో పెద్ద స్టార్‌గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కల నిజం చేసిన యువ బౌలర్

మ్యాచ్ అనంతరం ప్రఫుల్ మాట్లాడుతూ, “నా ఐపీఎల్ అరంగేట్రంలోనే 4 లేదా 5 వికెట్లు తీయాలని ముందే రాసుకున్నాను. పవర్‌ప్లేలో బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నాను. నా ప్లాన్ సక్సెస్ అయింది. సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేస్తానని ముందే చెప్పాను” అని తెలిపాడు. తన విజయాన్ని కుటుంబానికి అంకితం చేస్తూ భావోద్వేగానికి లోనైన హింగే, కష్టపడి సాధించిన ఈ ఘనత తన జీవితంలో ప్రత్యేకమని పేర్కొన్నాడు.

Also read:

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »