ఒక్క ప‌రుగు తేడాతో అర్ధ సెంచ‌రీ మిస్ చేసుకున్న కోహ్లీ.. వైర‌ల్ అవుతున్న అనుష్క రియాక్ష‌న్

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. లక్నోపై 5 వికెట్ల తేడాతో గెలిచిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 49 పరుగులతో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే విరాట్ ఔట్ అయిన స‌మ‌యంలో అనుష్క ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్‌గా మారింది.

Virat Kohli playing a shot against Lucknow Super Giants in IPL 2026 at M. Chinnaswamy Stadium.
Virat Kohli playing a shot against Lucknow Super Giants in IPL 2026 at M. Chinnaswamy Stadium.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. బుధవారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఆరంభాన్ని అందించాడు. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. హాఫ్ సెంచరీకి ఒక పరుగుదూరంలో ఉండగానే ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన కోహ్లీ, బౌండరీ వద్ద నికోలస్ పూరన్ చేతికి చిక్కి ఔట్ కావడం అభిమానులను నిరాశపరిచింది.

అనుష్క రియాక్ష‌న్ వైర‌ల్..

కోహ్లీ ఔట్ అవడాన్ని స్టాండ్స్‌లో వీక్షిస్తున్న అతని భార్య అనుష్క శర్మ కూడా నిరాశతో స్పందించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ స‌మయంలో విరాట్ క‌న్నా అనుష్క‌నే ఎక్కువ‌గా బాధ‌ప‌డి ఉంటుంద‌ని నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 40 పరుగులు, ఆయుష్ బడోని 38 పరుగులు, ముకుల్ చౌదరి 39 పరుగులతో రాణించారు.

సుల‌భంగా ల‌క్ష్య చేధ‌న‌..

ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పగా, భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్యా రెండు వికెట్లు, జోష్ హేజిల్‌వుడ్ ఒక వికెట్ సాధించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో రజత్ పాటిదార్ (27) వేగంగా ఆడగా, జితేశ్ శర్మ (23) తక్కువ బంతుల్లో కీలక పరుగులు జోడించాడు. దీంతో ఆర్‌సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సులభంగా చేధించింది.


ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయం. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుస విజయాలతో ఆర్‌సీబీ టైటిల్ రేసులో బలమైన పోటీదారుగా అవతరిస్తోంది.

మ‌రోవైపు ఎల్ఎస్‌జీ మాత్రం దారుణంగా నిరాశ ప‌రుస్తుంది. కొత్త కెప్టెన్‌తో పాటు మార్ష్, మార్క్ర‌మ్, పంత్, పూర‌న్ వంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన‌ప్ ఉన్నా కూడా వారి రాత మార‌డం లేదు. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో పంత్ గాయ‌ప‌డ‌గా, ఆయ‌న త‌దుప‌రి మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. ఒక‌వేళ గాయం పెద్ద‌దైతే అది ల‌క్నో జ‌ట్టుకి పెద్ద దెబ్బే అవుతుంది.

Also Read:

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »