భగీరథ్‌ను అరెస్ట్‌ చేయలేదు.. లొంగిపోయాడు.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కౌంటర్‌

పోక్సో కేసు (POCSO Case)లో బండి భగీరథ్‌ (Bandi Bhagirath) అరెస్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్‌ (BRS) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ (RS Praveen Kumar) మాట్లాడుతూ.. భగీరథ్‌ను పోలీసులు పట్టుకోలేదని, ఆయనే లాయర్లతో కలిసి లొంగిపోయాడని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీజేపీ (BJP) నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

RS Praveen Kumar Pressmeet
భగీరథ్‌ను అరెస్ట్‌ చేయలేదు.. లొంగిపోయాడు.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కౌంటర్‌

RS Praveen Kumar | పోక్సో కేసులో బండి భ‌గీర‌థ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, లాయ‌ర్లతో క‌లిసి లొంగిపోయాడని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వ్యాఖ్యనించారు. బండి భ‌గీర‌థ్‌ను అరెస్టు చేశామని, లొంగి పోలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణించి పోతున్నాయని, రాష్ట్రంలో మైనర్ బాలికలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. పోక్సో కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అబద్ధాలు చెప్తున్నాడని, రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రజలకు పోక్సో కేసులో బండి భగీరథ్‌ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి పడుతున్న తంటాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోక్సో కేసులో బీఆర్ఎస్ గళం ఎత్తడంతోనే భగీరథ్ జైలుకు వెళ్లాడన్నారు. భగీరథ్‌ను అరెస్ట్ చేశామని రేవంత్ రెడ్డి అంటున్నాడని, బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించామని బండి సంజయ్ అంటున్నాడని గుర్తు చేశారు. బండి సంజయ్ మాటలను నమ్మాలా.. రేవంత్ రెడ్డి మాటలను నమ్మాలా అర్థం కావడం లేదన్నారు. బండి భగీరథ్ లాయర్లతో కలిసి లొంగిపోయాడని, ఆయ‌న‌ను అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. బండి భగీరథ్‌ను పట్టుకునేందుకు నాకాబంది ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని ప్రవీణ్‌ కుమార్‌ మండిపడ్డారు.

Read Also : బండి భగీరథ్‌ లొంగిపోలేదు.. మేమే అరెస్టు చేశాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

భరతం పట్టేందుకే ఉద్యోగం వదులుకున్నా..

నేను వాస్తవాలు మాట్లాడుతుంటే రిటైర్డ్ అయిన తహశీల్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి అంటున్నాడని, నేను వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ అధికారిని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ల భరతం పట్టేందుకు నేను ఉద్యోగం వదులుకున్నానన్నారు. నేను మళ్ళీ ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు లేదని, రిటైర్డ్ అయిన పోలీస్ అధికారి ప్రశాంతంగా బతకాలని అనుకుంటాడని ఆయ‌న తెలిపారు. బాధితురాలి ఫొటోలు బయటపెట్టింది బీజేపీ సోషల్ మీడియానన్నారు. బాధితురాలు పేరు, ఫొటోలు బయట పెట్టింది బీజేపీ, బీజేపీ నాయకులు మాత్రమే బయటపెట్టారని, బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదన్నారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రజలకు చెబుతున్నాడని బీఆర్‌ఎస్‌ నేత మండిపడ్డారు. అబద్ధాలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడ‌ని దుయ్యబట్టారు.

Read Also : రైతు నోట్లో మట్టికొట్టారు.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఘాటు లేఖ..!

రేవంత్ రెడ్డికి ఉన్న మైండ్ కాస్త పోతుంది..

మైనర్ బాలిక కేసు విషయంలో కేసీఆర్ మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడని, పోక్సో కేసులో కేసీఆర్ ఆదేశాలతో తాము మాట్లాడుతుంటేనే రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఉన్న మైండ్ కాస్త పోతుందని, మైనర్ బాలికకు అన్యాయం చేసిందే పోలీసులని, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మైనర్ బాలికకు న్యాయం జరిగేలా లేదన్నారు. హైకోర్టు న్యాయమూర్తి భర్తపై ఒక వ్యక్తి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే అప్పటికప్పుడు అరెస్ట్ చేసినప్పుడు.. మైనర్ బాలికపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేదని నిలదీశారు. మైనర్ బాలికను, ఆమె తల్లిని బండి సంజయ్, సంగప్ప బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయని, బాలిక‌ను, ఆమె త‌ల్లిని బెదిరించినందుకు సెక్షన్ 238 ప్రకారం బండి సంజయ్ నేరస్థుడు, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు ర‌గ‌డ‌.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్ర‌భుత్వం మ‌ధ్య మాట‌ల యుద్ధం..!

బండి సంజ‌య్‌ను కాపాడ‌మ‌ని మోదీ చెప్పిండు..

బండి సంజయ్‌ను కాపాడమని ప్రధాని మోదీ రేవంత్ రెడ్డికి చెప్పిండని.. ఇది నిజమన్నారు. దీనిపై ఎక్కడైనా తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధమన్నారు. బండి సంజయ్‌పై కేసు నమోదు చేయ‌కుండా కేసును నీరుగార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని, మైనర్ బాలికపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మొదటి నుంచి పోరాడిందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ రఘునందన్ రావు, మాధవీలత మైనర్ బాలిక కేసు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఈ రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేదని, బాలికకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Read Also : Panic Button | పబ్లిక్‌ వాహనాల్లో పానిక్‌ బటన్‌, ట్రాకింగ్‌ డివైజ్‌ తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »