ఏపీకి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌.. భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న ద్విచ‌క్ర వాహ‌నాల కంపెనీ..!

ఆంధ్రప్రదేశ్‌కి మ‌రోసారి భారీ పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) తిరుపతి జిల్లా సత్యవేడు వద్ద రూ.2,508 కోట్లతో భారీ మోటార్‌సైకిల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌తో వేలాది ఉద్యోగ అవకాశాలు ల‌భించ‌నున్నాయి.

Royal Enfield
ఏపీకి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌.. భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న ద్విచ‌క్ర వాహ‌నాల కంపెనీ..!

Royal Enfield | ఆంధ్రప్రదేశ్‌లో మ‌రో కంపెనీ భారీ పెట్ట‌బ‌డులు పెట్ట‌నున్న‌ది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ రాష్ట్రంలోనే త‌న రెండో త‌యారీ కేంద్రాన్నిఏర్పాటు చేసేందుకు నిర్ణ‌యించుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం ప్రాంతంలో సుమారు 267 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు సంస్థ ప్రణాళికలు ముందుకువ‌చ్చింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది. మొత్తం రూ.2,508 కోట్ల పెట్టుబడితో ఏర్పడనున్న ఈ యూనిట్‌ ద్వారా దాదాపు 3వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం సంస్థకు చెందిన ప్రధాన భాగాలు తమిళనాడులోని కేంద్రాల్లో ఉన్నాయి.

Read Also : భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు..!

రెండుద‌శ‌ల్లో ప్లాంట్ విస్త‌ర‌ణ‌..

అయితే, ఇటీవ‌ల కాలంలో భారత మార్కెట్లో ప్రీమియం బైక్‌ల విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బైక్‌లను విక్రయిస్తోంది. ముఖ్యంగా 250 సీసీ నుంచి 750 సీసీ విభాగంలో ఈ బ్రాండ్‌కు బలమైన డిమాండ్ ఉన్న‌ది. ఈ యూనిట్‌ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మోటార్‌సైకిళ్ల ఎగుమతులకు కూడా కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. అంతేకాకుండా, అనుబంధ పరిశ్రమలు, వెండర్‌ కంపెనీలు రాష్ట్రానికి వచ్చే అవకాశముండడంతో మరిన్ని పెట్టుబడులు ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. ప్రాజెక్టు తొలి దశలో రూ.1,249 కోట్లతో తయారీ ప్లాంట్‌, ప్రొడక్షన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, వెండర్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2026-27లో పనులు ప్రారంభించి, 2028-29 నాటికి ఈ దశను పూర్తి చేయాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకెళ్తోంది.

Read Also : టీచర్‌ ప్రమోషన్లకు టెట్‌ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

2032వ‌ర‌కు విస్త‌ర‌ణ పూర్తి..

రెండో దశలో మరో రూ.1,259 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను కంపెనీ మరింత విస్త‌రించ‌నుంది. ఈ దశ పనులు 2029-30లో ప్రారంభమై, 2031-32 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించింది రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు కంపెనీ కార్య‌క‌లాపాలు పొరుగురాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులోనే ఎక్కువ‌గా ఉండ‌గా.. అక్కడ సంస్థ నాలుగు ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసింది. విదేశాల్లో కూడా ఉత్తర అమెరికా, కెనడా, బ్రిటన్‌, బ్రెజిల్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో అనుబంధ కేంద్రాలు ఉన్నాయి. అలాగే యూకేలోని బ్రంటింగ్‌థోర్ప్‌తో పాటు చెన్నైలో పరిశోధన కేంద్రాలను సైతం సంస్థ నిర్వ‌హిస్తుండ‌డం విశేషం. తాజాగా కంపెనీ ఏపీకి వ‌స్తుండ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. యువ‌త‌కు మంచి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని, ప‌రోక్షంగా మ‌రికొంత మందికి సైతం ఉపాధి దొరుకుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు ర‌గ‌డ‌.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్ర‌భుత్వం మ‌ధ్య మాట‌ల యుద్ధం..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »