AP Govt | ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. పదోన్నతుల ప్రక్రియలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)ను తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను ప్రోత్సహించే భాగంగా ఎంపికైన టీచర్లను ఫిన్లాండ్ విద్యావ్యవస్థ అధ్యయనానికి పంపించాలని నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్-2 హెడ్మాస్టర్ పదోన్నతులకు ఇకపై టెట్ అర్హత కీలకంగా మారనుంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTC) నిబంధనలు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆధారంగా తీసుకుని ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉప్యాధ్యాయులు ఎప్పుడెప్పుడు సర్వీస్లో చేరినా.. ప్రమోషన్స్ పొందే సమయానికి టెట్ అర్హత సాధించాల్సి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
Read Also : భవిష్యత్లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..!
సీనియారిటీ జాబితాలో టెట్ వివరాలు
ఈ నిబంధన అమలు కోసం ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాల్లో ప్రత్యేక మార్పులు చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల జాబితాల్లో టెట్కు సంబంధించిన ప్రత్యేక కాలమ్ను చేర్చనున్నారు. ఇందులో ఏపీటెట్ లేదా సీటెట్లో అర్హత సాధించారా, ఏ పేపర్లో ఉత్తీర్ణులయ్యారు, మార్కులు ఎంత వచ్చాయి, సబ్జెక్టు, మాధ్యమం వంటి వివరాలు నమోదు చేయనున్నారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లకు గతేడాది ప్రభుత్వం ప్రత్యేకంగా టెట్ పరీక్ష రాసే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న 31 మంది టీచర్లతో పాటు సీమ్యాట్ కాంట్రాక్ట్ లెక్చరర్ సతీష్రెడ్డిని ఫిన్లాండ్కు పంపనుంది.
Read Also : జనసేన ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు… మహిళా కమిషన్ స్పందన, ఎమ్మెల్యే కౌంటర్
ప్రభుత్వ ఖర్చులతో టూర్
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్ ప్రాథమిక విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఈ పర్యటనను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చులతో జరిగే ఈ టూర్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా కూడా పాల్గొంటారు. ఆగస్టు 17 నుంచి 26 వరకు ఈ బృందం ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కుని సందర్శించి అక్కడి బోధనా విధానాలు, విద్యా నిర్వహణ పద్ధతులను పరిశీలించనుంది. పర్యటన పూర్తయ్యాక వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయగల అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.
Read Also : రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో ఏపీలో దారుణం… మాజీ ప్రియుడిపై పగతో భార్యకు వైరస్ ఇంజెక్షన్


