గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఒకే చర్చ… విరోష్ వెడ్డింగ్. టాలీవుడ్లో అత్యంత పాపులర్ జంటగా నిలిచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో ఈ డ్రీమ్ వెడ్డింగ్ జరగనుంది. వీరి పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే వీరి పెళ్లి ప్రత్యేకత ఏమిటంటే… ఒకే రోజు రెండు సార్లు వివాహం జరగనుండటం. విజయ్ దేవరకొండ తెలుగు కుటుంబానికి చెందినవారు కావడంతో తెలుగు సంప్రదాయంలో ఒకసారి, రష్మిక మందన్న కర్ణాటకలోని కొడవ సమాజానికి చెందిన అమ్మాయి కావడంతో కొడవ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు నిర్వహించనున్నారు.
కొడవ పెళ్లి ప్రత్యేకత ఏమిటి?
తెలుగు పెళ్లిలో మాంగళ్యధారణ అత్యంత ముఖ్య ఘట్టం అనే విషయం మనందరికి తెలిసిందే. వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేయడం ప్రధాన ఆచారం. అయితే కొడవ సంప్రదాయంలో మాత్రం మాంగళ్యధారణ వంటి ఘట్టం ఉండదని టాక్ నడుస్తుంది. అక్కడ పూజారుల కంటే పూర్వీకుల ఆశీర్వాదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
తెలుగు పెళ్లిళ్లలో బియ్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. తలంబ్రాలు, అక్షింతలు, ఒడి బియ్యం వంటి ఆచారాలు ముఖ్యమైనవి. కానీ కొడవ వివాహంలో వధువు ఒడి బియ్యం స్థానంలో కాయిన్స్ మూటను పట్టుకుని రావడం ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అదేవిధంగా వధూవరుల వస్త్రధారణ కూడా సంప్రదాయబద్ధంగా భిన్నంగా ఉంటుంది. పెళ్లి తంతులో వధువు తల్లికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ప్రీ వెడ్డింగ్ వేడుకలు సందడి
ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ ఉదయ్పూర్లో ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే మెహందీ వేడుక నిర్వహించగా, ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 26న తెలుగు, కొడవ సంప్రదాయాల్లో రెండు విధాలుగా వివాహ తంతు పూర్తి చేసి, రష్మిక–విజయ్ అధికారికంగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.
మొత్తానికి విరోష్ వెడ్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. ఈ రాయల్ వెడ్డింగ్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.