ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని షాక్కు గురిచేసింది. డ్రామండ్గంజ్ ప్రాంతంలో లసోడా వైపు దిగే లోయ మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఒక ట్రక్కు బ్రేకులు విఫలమవడంతో ముందున్న వాహనాలను అదుపుతప్పి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒక కారు రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. అదే సమయంలో ప్రమాదానికి గురైన కారుతో పాటు ఒక ఎస్యూవీ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో 11 మంది సజీవదహనమయ్యారు. ఘటన తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతదేహాలను వెలికితీయడం, మంటలను అదుపులోకి తీసుకురావడం, దెబ్బతిన్న వాహనాలను తొలగించడం వంటి పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారులు స్పందిస్తూ, ట్రక్కు బ్రేకులు విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఘటన స్థలంలో రెండు ట్రక్కుల మధ్య ఒక చిన్న కారు పూర్తిగా దెబ్బతిన్న దృశ్యం కనిపించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ను నియంత్రిస్తూ, రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన ట్రక్కుల్లో ఒకటి బీహార్ రిజిస్ట్రేషన్కు చెందగా, మరొకటి మధ్యప్రదేశ్కు చెందినదిగా గుర్తించారు. ఇతర వాహనాల్లో ఒకటి సోన్భద్ర జిల్లాకు, మరొకటి మీర్జాపూర్ జిల్లాకు చెందినవిగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
గుజరాత్లో మరో ప్రమాదం, 8 మంది మృతి
ఇదే రోజు వల్సాద్ జిల్లాలోని కపరాడా ప్రాంతంలో కూడా మరో విషాదకర ప్రమాదం జరిగింది. ఒక పికప్ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో 8 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు.
పోలీసుల సమాచారం ప్రకారం, బాధితులు ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై మరింత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా వాహనాల సాంకేతిక లోపాలు, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వంటి కారణాల వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:


