RAC ప్రయాణీకులకు సగం సీటే లభిస్తున్నా పూర్తి ఛార్జీ వసూలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది న్యాయమా అనే ప్రశ్నతో రైల్వే విధానంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
- RAC టికెట్: సగం సీటు, కానీ పూర్తి ఛార్జీ
- భారతీయ రైల్వేలు విధానంపై ప్రయాణీకుల అసంతృప్తి
- పార్లమెంటరీ కమిటీ పాక్షిక వాపసుకు సిఫార్సు
భారతీయ రైల్వేల RAC (Reservation Against Cancellation) వ్యవస్థ మరోసారి వివాదానికి కేంద్రంగా మారింది. RAC కింద ప్రయాణించే వారికి పూర్తి బెర్త్ కాకుండా సగం సీటు మాత్రమే లభిస్తుండగా, ఛార్జీ మాత్రం పూర్తిగా వసూలు చేయడంపై ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఒక సీటుపై ఇద్దరు ప్రయాణీకులు RAC కింద ప్రయాణిస్తారు. అయితే ఆ సీటుకు వసూలు చేసే ఛార్జీని ఇద్దరి మధ్య పంచుకోవాల్సిన బదులు, ఒక్కొక్కరినీ పూర్తి టికెట్ ధర చెల్లించాల్సిందిగా చేయడం అన్యాయమన్న వాదన వినిపిస్తోంది. “అసంపూర్ణ సేవకు పూర్తి ధర ఎందుకు?” అన్న ప్రశ్నకు రైల్వేల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
మేడ్చల్ అలియాబాద్లో బీఆర్ఎస్ ప్రచారంపై కాంగ్రెస్ దాడి… ఉద్రిక్తత
సౌకర్యాలపై రాజీ… ఛార్జీలపై కాదు
RAC ప్రయాణంలో ప్రయాణీకులు సౌకర్యం, స్థలం, గౌరవం విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. రాత్రి ప్రయాణాల్లో ఇది మరింత ఇబ్బందిగా మారుతోంది. అయినప్పటికీ భారతీయ రైల్వేలు ఆదాయ విషయంలో మాత్రం రాజీ పడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని “సర్దుబాటు”గా కాకుండా “సంస్థాగత దోపిడీ”గా కొందరు అభివర్ణిస్తున్నారు.
RAC రద్దు లేదా న్యాయమైన ఛార్జీలు
ప్రయాణీకులు, ప్రయాణికుల సంఘాలు RAC విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని లేదా ఛార్జీల వ్యవస్థను న్యాయంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. వారి సూచన స్పష్టం:
- పూర్తి సీటు ఉంటే → పూర్తి ఛార్జీ
- సగం సీటు మాత్రమే ఉంటే → సగం ఛార్జీ
ఇదికాక మరే విధానమైనా అన్యాయమే అన్న అభిప్రాయం బలపడుతోంది.
పార్లమెంటరీ కమిటీ సూచన
ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ కూడా స్పందించింది. పూర్తి బెర్త్ లభించని RAC ప్రయాణీకులకు టికెట్ ఛార్జీలో పాక్షిక వాపసు ఇవ్వాలి అని కమిటీ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ సూచన అమలులోకి వస్తే లక్షలాది ప్రయాణీకులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఇప్పటికైనా రైల్వేలు ఈ విధానాన్ని పునఃసమీక్షిస్తాయా? లేక RAC వివాదం మరింత పెద్ద చర్చగా మారుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.