రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బాటసింగారం వద్ద వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. అక్కడ పార్క్ చేసి ఉన్న కార్లను ఢీకొట్టడంతో రెండు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి. ప్రమాద దృశ్యాలు పెట్రోల్ బంక్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఒక్కసారిగా బంక్లోకి దూసుకొచ్చిన బస్సు
సమాచారం ప్రకారం.. చౌటుప్పల్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బాటసింగారం వద్దకు చేరుకున్న సమయంలో అదుపుతప్పింది. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. బస్సు వేగంగా రావడాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
బంక్లో పెట్రోల్ పోయించుకునేందుకు నిలిపి ఉంచిన ఓ కారును బస్సు బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బస్సు ఢీకొనడంతో పెట్రోల్ బంక్కు చెందిన యంత్రం కూడా కొంత దూరం ఎగిరిపడినట్లు సమాచారం.
బస్సులో 40 మంది ప్రయాణికులు
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులతో పాటు పెట్రోల్ బంక్ సిబ్బందికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు ఢీకొనడంతో మొత్తం రెండు కార్లు, ఓ ఆటో ధ్వంసమైనట్లు సమాచారం.
సీసీటీవీ ఫుటేజ్
హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం
అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం వద్ద బైక్ను తప్పించబోయి అదుపుతప్పి పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఈ ప్రమాదంలో పెట్రోల్ బంక్లో ఉన్న కారు, ఆటో, డీజిల్ పంపును ఢీకొట్టిన బస్సు pic.twitter.com/hc8i2igQJ5
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
అయితే బంక్లో ఆ సమయంలో కార్లు, సిబ్బంది ఉన్న నేపథ్యంలో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా బస్సు ముందు కారును ఢీకొనకుండా నేరుగా పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
బ్రేక్ ఫెయిల్యూర్.. స్టీరింగ్ లాక్?
బస్సు అదుపుతప్పడానికి అసలు కారణం ఏంటన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రమాదానికి ముందు బస్సు మరో కారును ఢీకొన్నట్లు కూడా సమాచారం. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల బస్సు అదుపుతప్పిందా? లేక స్టీరింగ్లో సాంకేతిక సమస్య తలెత్తిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం అనంతరం బస్సును అక్కడి నుంచి పక్కకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బస్సు ప్రమాదానికి ఖచ్చితమైన కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
మొత్తంగా.. కారులో ఎవరూ లేకపోవడం, బంక్ సిబ్బంది ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఈ ఘటన మరింత ఘోరంగా మారే అవకాశం ఉండేది.
