Bandi Sanjay | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 120 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్, ప్రధాని Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. మోదీ 3.0 పాలనలో దక్షిణ భారతదేశంలో కేంద్రం నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని పేర్కొన్నారు.
Read Also : మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు.. నరసన్నపేటలో ప్రకటించిన చంద్రబాబు..
11లక్షల ఉద్యోగాల భర్తీ..
గత రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరిగినట్టు తెలిపారు. కేంద్రం–రాష్ట్రాల్లో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఉన్నప్పుడే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అదే విధంగా తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 ఏళ్లలో కేంద్రం సుమారు రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. యూసీఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కలిపి రూ.7,766 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రోజ్గార్ మేళా గురించి మాట్లాడుతూ, 2022 అక్టోబర్ 22న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 11 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ఆయన వెల్లడించారు. 19వ విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో మరో 51 వేల మందికి నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. మొత్తం ప్రక్రియలో అవినీతి, పైరవీలు, దళారుల ప్రమేయం లేకుండా మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో తెలంగాణలో ‘నిరుద్యోగ మార్చ్’ నిర్వహించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న బండి సంజయ్, అప్పటి నిరుద్యోగుల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకతతో నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు పొందిన యువతను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ‘కర్మయోగి పోర్టల్’ ద్వారా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.
Read Also : ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్.. భారీగా పెట్టుబడులు పెడుతున్న ద్విచక్ర వాహనాల కంపెనీ..!
సప్త సూత్రాలు పాటించాలి..
దేశ అభివృద్ధిలో భాగస్వాములై, కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారత్ స్థిరంగా ఉండాలంటే ప్రధాని సూచించిన ‘సప్తసూత్రాలు’ పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాటిలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం, బంగారం కొనుగోళ్లు తగ్గించడం, వంటనూనె పొదుపు, సేంద్రీయ వ్యవసాయం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, వర్క్ ఫ్రమ్ హోం ప్రోత్సాహం వంటి అంశాలు ఉన్నాయని వివరించారు. దేశాభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న బండి సంజయ్, “దేశం ముందు – కుటుంబం తరువాత” అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం సమానంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Read Also : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం.. నిజామాబాద్లో అత్యధికంగా 45.7 డిగ్రీలు..


