Chandrababu Naidu | తెలుగుదేశం పార్టీలో ఇకపై పనితీరే ప్రమాణమని, తప్పులు చేసే వారిని, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేలా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ పదవుల కేటాయింపుల నుంచి ఎన్నికల టిక్కెట్ల ఎంపిక వరకు ప్రతి దశలోనూ నిరంతర సర్వేలు నిర్వహిస్తామని, ప్రజల అభిప్రాయం, కార్యకర్తల ఫీడ్బ్యాక్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్చార్జ్లతో నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, క్షేత్రస్థాయి నిర్వహణ, ఎన్నికల దిశగా అనుసరించాల్సిన విధానాలపై ఆయన విస్తృతంగా దిశానిర్దేశం చేశారు.
Read Also : సడలింపులు ఇవ్వండి.. కేంద్రానికి చంద్రబాబు లేఖ..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడబోనని చంద్రబాబు పేర్కొన్నారు. “ఇకపై ఓటమి అనే మాట టీడీపీకి ఉండదు. ప్రజలతో అనుసంధానంగా పని చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అంతకంటే ముఖ్యంగా స్వీయ సమీక్ష చేసుకుంటూ తప్పులు సరిదిద్దుకుంటున్నాం. అందుకే పార్టీని దెబ్బతీసే వారిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు” అని ఆయన వ్యాఖ్యానించారు. గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని సూచిస్తూ, మంగళగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబు ఉదాహరణగా ప్రస్తావించారు. 2019లో ఓటమి ఎదురైనా పట్టుదలతో పనిచేసి 2024లో ఆ ప్రాంతాన్ని పార్టీకి బలమైన కోటగా మార్చిన తీరును గుర్తుచేశారు. “లోకేష్ తరహాలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో నిలబడి పని చేయాలి” అని పిలుపునిచ్చారు. సానుకూల ఆలోచన, క్రమశిక్షణతో ముందుకెళ్తే ఫలితాలు తప్పకుండా అనుకూలంగా వస్తాయని పేర్కొన్నారు.
Read Also : ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్..! డైట్ ఛార్జీల పెంపు దిశగా ప్రభుత్వం అడుగులు..!
ఈ సందర్భంగా ప్రతిపక్షంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేసిందని ఆయన ఆరోపించారు. డీఎస్సీ-2025 అంశంపై కూడా దుష్ప్రచారం చేశారని, అయితే ఆధారాలతో సహా సమాధానం ఇచ్చిన తర్వాత వారు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. కూటమి ధర్మాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్తో గెలుపు సాధ్యమైందని, కూటమి ఐక్యతే ఆ విజయానికి కారణమని గుర్తుచేశారు. పొత్తుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాలని సూచించారు. “యుద్ధాన్ని గెలిపించే బాధ్యత నాది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రతి బూత్లో మరింత బలంగా నిలబడి పనిచేసే బాధ్యత మీది” అని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఆదేశించారు.
Read Also : ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదన


