Road Accident | ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’తో గుర్తింపు పొందిన డ్యాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. పండు తన డ్యాన్స్ బృందంతో కలిసి తగరపువలసలో జరిగిన ఓ జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బృందం కారులో తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో ఆనందపురం పరిధిలోకి వచ్చేసరికి కారులో ఉన్న ఒకరికి అస్వస్థత కలగడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. అదే సమయంలో పండు కూడా కారులో నుంచి బయటకు దిగారు. ఆ క్షణంలోనే వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. అదే ఢీకొట్టే వేగానికి పండు మాస్టర్పై కూడా వ్యాన్ అదుపుతప్పి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Also : విశాఖ రైల్వేజోన్ కల సాకారం.. అధికారంగా అమల్లోకి..
వెంటనే అక్కడే ఉన్న సహచరులు, స్థానికులు స్పందించి ఆయన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఢీకొన్న తీవ్రతకు పండు ప్రయాణిస్తున్న కారు, అలాగే ముందు ఆగి ఉన్న మరో బొలెరో వాహనం కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదం తర్వాత అక్కడి ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వినూత్న డ్యాన్స్ స్టెప్పులు, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పండు, తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేజ్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విస్తృతంగా గుర్తింపు పొందాడు. డ్యాన్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న ఆయన, అనేక ఈవెంట్స్లో పాల్గొంటూ యువతలో మంచి క్రేజ్ సంపాదించారు. ‘ఢీ’ షోతో వచ్చిన పాపులారిటీ ఆయనను డాన్స్ సర్కిల్స్లో ప్రత్యేక గుర్తింపుకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురవడం అభిమానులను కలిచివేసింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. పండు మాస్టర్ త్వరగా కోలుకుని మళ్లీ తన డ్యాన్స్తో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read Also : ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి.. మహానాడు వేదికగా డిమాండ్ చేసిన చంద్రబాబు..


