వినాయక నిమజ్జనంలో విషాదం.. నీట మునిగి ఆరుగురు విద్యార్థుల మృతి

సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల నేరేడు చెరువులో వినాయక నిమజ్జనం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. విగ్రహం మీద పడటంతో ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు.

ganesh immersion tragedy six students died sangareddy
ganesh immersion tragedy six students died sangareddy

Sanga Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. నేరేడు చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఇంద్రేశం పురపాలిక పరిధిలోని శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులు బుధవారం సాయంత్రం పెద్దకంజర్ల నేరేడు చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. ఎనిమిది మంది విద్యార్థులు విగ్రహాన్ని చెరువులోని లోతైన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విగ్రహం ఒకవైపునకు ఒరిగి విద్యార్థులపై పడటంతో వారు నీటిలో మునిగిపోయారు.

ఈ ప్రమాదంలో నర్సింహరాజు (22), సుమంత్‌రెడ్డి (17), గణేశ్‌ (18), సిద్దార్థ్‌ (17), శ్యాంకుమార్‌ (17), ఉదయ్‌కిరణ్‌ (17) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సింహరాజు తూర్పుగోదావరి జిల్లా వేమవరం ప్రాంతానికి చెందినవాడిగా, సుమంత్‌ ఖమ్మం, గణేశ్‌, సిద్దార్థ్‌ వరంగల్‌, శ్యాంకుమార్‌ బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌, ఉదయ్‌కిరణ్‌ సంగారెడ్డి విద్యానగర్‌కు చెందినవారిగా గుర్తించారు.

వర్షిత్‌, అఖిల్‌ అనే మరో ఇద్దరు విద్యార్థులు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ట్రస్ట్‌ నిర్వాహకులు విద్యార్థులను పటాన్‌చెరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆరుగురికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

లోతైన ప్రాంతానికి వెళ్లొద్దని సూచించినా..

శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌కు చెందిన వినాయక విగ్రహాన్ని గత మూడేళ్లుగా ఇదే చెరువులో నిమజ్జనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చెరువు లోతైన ప్రాంతానికి వెళ్లవద్దని వార్డెన్‌, స్థానికులు విద్యార్థులను హెచ్చరించినప్పటికీ.. విగ్రహాన్ని లోతైన ప్రాంతంలోనే నిమజ్జనం చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విగ్రహం అదుపుతప్పి విద్యార్థులపై పడటంతో ప్రమాదం చోటుచేసుకుంది.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

విద్యార్థుల మృతిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో లోతైన ప్రదేశాలను ముందుగానే గుర్తించి, ప్రజలు అక్కడికి వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, రక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాలు, గనులు మరియు భూగర్భశాస్త్ర శాఖల మంత్రి , చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి ప్రకటించారు.

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి మృత విద్యార్థులకు నివాళులు అర్పించారు. పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేసి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.

ఈ ఘటనపై మాజీ మంత్రి కవిత కల్వకుంట్ల కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పండుగ వేళ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »