భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల వివాహం 2017లో ఇటలీలోని టస్కనీ లో అత్యంత గోప్యంగా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ భద్రతను దాటుకుని ఓ ఆగంతకుడు పెళ్లి వేదిక వద్దకు వెళ్లిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని ఆ వేడుకకు భద్రత పర్యవేక్షించిన సెక్యూరిటీ హెడ్ యాసిన్ ఖాన్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి సాధారణంగా గేట్క్రాషర్లు చేసేలా కాకుండా, చాలా ధైర్యంగా ప్లాన్ చేసుకున్నాడు. ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో, అచ్చం ఒక మహారాజా లాంటి దుస్తులు ధరించి పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అతని వెంట మరో సఫారీ వాహనంలో ఇద్దరు బౌన్సర్లు ఉండటంతో భద్రతా సిబ్బంది అతడిని ఒక ముఖ్యమైన అతిథిగా భావించి లోపలికి అనుమతించారు.
అనుమానం అలా వచ్చింది..
అప్పుడు గేట్ వద్ద ఉన్నవారు కొత్తగా చేరిన ట్రైనీ సిబ్బంది కావడంతో, అతని వేషధారణను చూసి మోసపోయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో యాసిన్ ఖాన్ ప్రధాన హాల్లో ఉండటంతో ఈ పొరపాటు జరిగింది.
లోపలికి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తన అనుమానం కలిగించింది. ఇతర అతిథులతో కలవకుండా, కేవలం సెలబ్రిటీలతో ఫోటోలు దిగడంపైనే దృష్టి పెట్టడం గమనార్హం. అతనితో వచ్చిన బౌన్సర్లు ఫోటోలు తీసి వెంటనే పక్కకు వెళ్లిపోవడం కూడా సెక్యూరిటీ దృష్టిని ఆకర్షించింది.
పెళ్లికి ఆహ్వానం లేదు..
దీనితో యాసిన్ ఖాన్ స్వయంగా అతడిని ప్రశ్నించగా, తాను ఒక ప్రముఖ అతిథి మేనల్లుడినని, ఆ అతిథి తరపున వచ్చానని చెప్పాడు. అయితే వెంటనే కోహ్లీ మేనేజర్ను సంప్రదించగా, ఆ వ్యక్తి చెప్పిన వివరాలు అసత్యమని తేలింది. ఆ అతిథికి ఇటలీ పెళ్లికి ఆహ్వానం లేకుండా, కేవలం ఢిల్లీలో జరిగే రిసెప్షన్కే ఆహ్వానం ఉన్నట్లు తెలిసింది.
దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని మర్యాదపూర్వకంగా బయటకు పంపించారు. మొదట అహంకారంగా ప్రవర్తించినా, చివరకు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ ఘటన, సెలబ్రిటీ ఈవెంట్లలో కూడా వేషధారణ ఆధారంగా జరిగే పొరపాట్లకు ఉదాహరణగా నిలిచింది. ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read:


