Jagtial Farmers Protest: జగిత్యాల జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని, సాగు అవసరాలకు అనుగుణంగా నిరంతరాయంగా నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
యూరియా పంపిణీలో జాప్యంపై ఆగ్రహం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ కారణంగా ఎరువుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపించారు. యాప్ల పేరుతో యూరియా అందించడంలో ఆలస్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
సాగు అవసరాలకు సరిపడా యూరియా సకాలంలో అందించాలని, యాప్ విధానాన్ని తక్షణమే ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు.
కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన |Jagtial Farmers Protest
సకాలంలో విద్యుత్ సరఫరా అందకపోవడంతో పంటలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, మోటార్లు కాలిపోవడంతో అదనపు ఆర్థిక నష్టం వస్తోందని తెలిపారు.
రైతులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టడంతో ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Jagtial Farmers Protest | ఆత్మకూరులోనూ కరెంట్ కోతలపై ధర్నా
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరులోనూ రైతులు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలను వెంటనే ఎత్తివేసి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో కనీసం ఏడు గంటల కరెంట్ కూడా అందడం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మార్పు ఇదేనా అంటూ రైతులు విమర్శలు చేశారు. ఇప్పటికైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం 10 నుంచి 14 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి
పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయని, మరో నెల రోజుల్లో పంటలు కోతకు వచ్చే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఈ సమయంలో కనీసం 10 నుంచి 14 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తే పంటలను కాపాడుకోవచ్చని అన్నారు.
ఒక గంట విద్యుత్ ఇచ్చి మరో గంట నిలిపివేస్తున్నారని, రోజుకు నాలుగైదు గంటలకు మించి కరెంట్ అందడం లేదని రైతులు వాపోయారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
జాతీయ రహదారిపై రాస్తారోకో
కరెంట్ కోతలను నిరసిస్తూ జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై చగల్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తీవ్ర విద్యుత్ కోతల కారణంగా పంటలకు సాగునీరు అందడం లేదని, మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని రైతులు హెచ్చరించారు.

