జగన్‌కు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు లేదు.. హోంమంత్రి అనిత ఘాటు విమర్శలు

విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) అంశంపై హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై తీవ్ర విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల (Steel Plant Workers) పోరాట సమయంలో మద్దతు ఇవ్వని జగన్‌కు ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె వ్యాఖ్యానించారు.

Anitha Fires at Jagan, Questions His Stand on Visakha Steel Plant

Anitha | వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు కర్మాగారం అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆమె.. గతంలో జగన్ వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు దీర్ఘకాలంగా పోరాటాలు చేసిన సమయంలో జగన్ ఎప్పుడూ వారి పక్షాన నిలబడలేదని అనిత ఆరోపించారు. కార్మికుల ఆందోళనలకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వని వ్యక్తి ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. కార్మికుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం బదులుగా, వారినే తన వద్దకు పిలిపించుకుని సమావేశాలు నిర్వహించడం రాజకీయ నాటకంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ భూములను ఇతర అవసరాలకు వినియోగించాలనే ఆలోచనలు జరిగాయని, ఈ విషయాన్ని అప్పటి ఉన్నతాధికారులే వెల్లడించారని హోంమంత్రి పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించలేదని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ గాడిన పడిందని అనిత తెలిపారు. ఒక దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సంస్థ ఇప్పుడు దాదాపు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించే నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చొరవతో ఈ నిర్ణయం అమలులోకి వచ్చిందన్నారు. అలాగే మరణించిన కార్మికుల కుటుంబాలకు బీమా ప్రయోజనాలు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపారు.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కేంద్ర ఉక్కు మంత్రిని ఒక్కసారి కూడా విశాఖకు తీసుకురాలేదని అనిత విమర్శించారు. ప్రస్తుతం మాత్రం కేంద్ర మంత్రి స్వయంగా ప్లాంట్‌ను సందర్శించి, గంటల తరబడి అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. బాధితులకు అందాల్సిన పరిహారం విషయంలో గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గంగవరం పోర్టులో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నుంచి రక్షించేందుకు కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాయని, ప్లాంట్ భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ అభివృద్ధి రెండింటినీ సమానంగా కాపాడేందుకు చర్యలు కొనసాగుతాయని అనిత స్ప‌ష్టం వివ‌రించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »