PDS | ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో పారదర్శకతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా అయ్యే బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లను తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వడంతో, దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రేషన్ బియ్యం సరఫరా వ్యవస్థలో సాంకేతికత వినియోగం వల్ల గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ వ్యవస్థ ద్వారా బియ్యం బస్తాల కదలికను ప్రతి దశలో పర్యవేక్షించే అవకాశం లభించిందన్నారు. మిల్లింగ్ కేంద్రాల నుంచి గోదాములు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలు, చివరకు లబ్ధిదారుల వరకు సరఫరా ప్రక్రియను పూర్తిగా ట్రాక్ చేయగలుగుతున్నామని వివరించారు.
ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణా, పక్కదారి పట్టించడం వంటి ఘటనలు గణనీయంగా తగ్గినట్లు కేంద్రానికి అందిన నివేదికలు సూచిస్తున్నాయని జోషి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పర్యవేక్షణ, అమలు తీరు ఆదర్శప్రాయంగా ఉందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అధికారులు వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంతో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన ఈ నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాలు నిజమైన అర్హులకు మాత్రమే చేరేలా చూడటం, మధ్యలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ నిధుల వినియోగంలో జవాబుదారీతనాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మంత్రి వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో విస్తృతంగా వినియోగించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమం ముందుకు సాగుతోందని చెప్పారు. డిజిటల్ పద్ధతుల ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రహ్లాద్ జోషి ప్రస్తావించారు. గత యూపీఏ పాలనతో పోల్చితే రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల కేటాయింపులు గణనీయంగా పెరిగాయని, సుమారు 325 శాతం అధికంగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం పూర్తి మద్దతు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ అమలు దేశవ్యాప్తంగా విస్తరించనున్న నేపథ్యంలో, ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త సంస్కరణలకు ఇది నాంది పలుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణకు ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రేషన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుందని అధికారులు భావిస్తున్నారు.


