WII Study | శ్రీశైలం ఘాట్లో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి వన్యప్రాణుల సంరక్షణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ దృష్టిసారించింది. పులులు, ఇతర వన్యప్రాణుల కదలికలకు ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. జాతీయ రహదారి-765 విస్తరణలో భాగంగా ఏపీలోని దోర్నాల నుంచి శ్రీశైలం జలాశయం వరకు, తెలంగాణలో బ్రాహ్మణపల్లి నుంచి జలాశయం వరకు రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర రహదారుల శాఖ ప్రతిపాదించింది. ఇందుకు పెద్దఎత్తున అటవీ భూమి అవసరమవుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని పరిశీలిస్తోంది. ప్రతిపాదనల ప్రకారం ఏపీ పరిధిలో 41.39 కిలోమీటర్లు, తెలంగాణ పరిధిలో 45.35 కిలోమీటర్లు కలిపి మొత్తం 86.74 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. వంతెన పిల్లర్ల నిర్మాణానికి అవసరమైన స్థలం మినహా అదనపు అటవీ భూమి అవసరం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
Read Also : భక్తులకు గుడ్న్యూస్.. తిరుమల తరహాలోనే ప్రముఖ ఆలయాల్లోనూ సేవ భాగ్యం..
పులుల కదలికలపై ఆరా
ప్రతిపాదిత కారిడార్ నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటంతో వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. పులులు, ఇతర వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, వాటి కదలికల మార్గాలు, నివాస ప్రాంతాలను బృందం గుర్తించనుంది. వన్యప్రాణుల సంచారానికి అవసరమైన అండర్పాస్లు, కల్వర్టులు ఎక్కడ నిర్మించాలి, వంతెన ఎత్తు ఎంత ఉండాలి, నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశాలపై డబ్ల్యూఐఐ నివేదిక ఇవ్వనుంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జాతీయ వన్యప్రాణుల బోర్డు సహా పలు సంస్థల అనుమతులు అవసరం. డబ్ల్యూఐఐ నివేదిక ఆధారంగా అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also : నిరుపేదల ప్రాణాలంటే ఎందుకు ఇంత చులకన భావం?.. రేవంత్ సర్కారుపై హరీశ్రావు ఫైర్
భక్తులకు సౌలభ్యం..
ప్రస్తుతం శ్రీశైలం ఘాట్ రహదారిలో రాత్రివేళ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి ప్రయాణం మరింత సులభం కానుంది. హైదరాబాద్, నాగర్కర్నూల్, దోర్నాల, మార్కాపురం, కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ఎంతో మంది భక్తులు తరలివచ్చే విషయం తెలిసిందే. జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రస్తుతం ఘాట్రోడ్డు మీదుగా ప్రయాణానికి భారీగా సమయం పడుతుంది. ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే భక్తులకు సమయం ఆదా కానుంది.
Read Also : దేశానికి ఆదర్శం మన మహిళలు.. ఇందిరా స్త్రీ శక్తి భవనాల శంకుస్థాపనలో సీఎం రేవంత్రెడ్డి


