Gold and Silver
-
బంగారం ధరలను నేరుగా కేంద్ర ప్రభుత్వం లేదా RBI నియంత్రించవు; రోజువారీ రేట్లను IBJA బెంచ్మార్క్ ధరల ఆధారంగా ఖరారు చేస్తుంది.
-
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు, డాలర్తో రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు బంగారం ధరలపై కీలక ప్రభావం చూపుతాయి.
-
దిగుమతి సుంకాలు, పన్నులు, రవాణా ఖర్చులు కలిసి రిటైల్ మార్కెట్లో మనం చెల్లించే తుది ధరగా మారుతాయి.
హైదరాబాద్: సాధారణంగా సామాన్యులు బంగారం ధర పెరిగితే ప్రభుత్వం మీదో, లేదా రిజర్వ్ బ్యాంక్ మీదో నెపం వేస్తుంటారు. కానీ నిజానికి పసిడి ధరల నిర్ణయం వెనుక ఒక సంక్లిష్టమైన అంతర్జాతీయ సమీకరణం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీ. అయితే, గత కొంతకాలంగా ఈ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ధరలను ఎవరు నియంత్రిస్తారు? ఏ ప్రాతిపదికన ప్రతిరోజూ రేట్లు మారుతుంటాయి? అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
చాలామంది భావిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికో లేదా ఆర్బీఐ (RBI) కో ఈ ధరలను పెంచే లేదా తగ్గించే అధికారం నేరుగా ఉండదు. భారతదేశంలో బంగారం ధరలను నిర్ణయించడంలో ‘ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్’ (IBJA) అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ దేశంలోని ప్రముఖ గోల్డ్ డీలర్ల దగ్గర నుండి కొనుగోలు, అమ్మకాల వివరాలను సేకరిస్తుంది. వారి కోట్స్ ఆధారంగా ఒక సగటు ‘బెంచ్ మార్క్’ ధరను ప్రతిరోజూ ఖరారు చేస్తుంది. దీనినే మనం రిటైల్ మార్కెట్లో ప్రామాణికంగా తీసుకుంటాం.
అయితే, ఈ ధరల వెనుక అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా ఎంతో ఉంటుంది. భారత్ తన అవసరాలకు సరిపడా బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి, లండన్ లేదా న్యూయార్క్ వంటి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ (సుమారు 31 గ్రాములు) బంగారం ధర ఎంత ఉందనేది కీలకం. వీటితో పాటు అమెరికా డాలర్తో పోల్చినప్పుడు భారత రూపాయి విలువ తగ్గినా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా ఆ ప్రభావం నేరుగా పసిడి ధరలపై పడుతుంది. వీటికి తోడు స్థానికంగా ఉండే దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులు, వివిధ రకాల పన్నులు తోడై మనకు తుది ధరగా మారుతాయి. అందుకే, ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఆర్థిక మార్పు జరిగినా, అది మనం ఇష్టపడే బంగారం ధరలో మార్పుకు దారితీస్తుంది.