కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై అదనంగా రూ.3 అదనంగా సుంకం..!

ఇంధన ఎగుమతుల విధానం (Fuel Export Policy)లో కేంద్రం కీలక మార్పులు చేసింది. పెట్రోల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ (Windfall Tax) అమలులోకి తీసుకువచ్చింది. డీజిల్‌, ఏటీఎఫ్‌పై ఎగుమతి సుంకాలను తగ్గించింది. ముడి చమురు ధరలు (Crude Oil Prices) పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

petrol
Petrol | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై అదనంగా రూ.3 అదనంగా సుంకం..!

Petrol | ఇంధన ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించింది. మరోవైపు డీజిల్‌, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పై ఎగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మే 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఇకపై పెట్రోల్‌ ఎగుమతులపై లీటరుకు రూ.3 విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించనున్నారు.

Read Also : వాత మొదలైంది.. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 పెంపు..!

అదే సమయంలో డీజిల్‌పై ఉన్న ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.23 నుంచి రూ.16.50కి, ఏటీఎఫ్‌పై ఉన్న సుంకాన్ని రూ.33 నుంచి రూ.16కి కుదించారు. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై విధించే రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే, దేశీయంగా విక్రయించే పెట్రోల్‌, డీజిల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం తెలిపింది. దీంతో సామాన్య ప్రజలపై ఇంధన ధరల భారం ఉండదని అధికారులు పేర్కొన్నారు.

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ ఎందుకు?

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన తర్వాత పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం విధించడం ఇదే తొలిసారి. అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో ఇంధన కొరత తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరలు ఉండడంతో చమురు కంపెనీలు ఎక్కువ మొత్తంలో విదేశాలకు ఎగుమతులు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

దాంతో దేశీయ అవసరాలకు ఇంధన సరఫరా దెబ్బతినకుండా ఉండేందుకే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతి సుంకాలను గత కొన్ని నెలలుగా కేంద్రం తరచూ సమీక్షిస్తోంది. ఏప్రిల్‌ 30న జరిగిన సమీక్షలో డీజిల్‌పై లీటరుకు రూ.23, ఏటీఎఫ్‌పై రూ.33 సుంకం కొనసాగించింది. ఇప్పుడు వాటిని తగ్గించింది. అంతకుముందు మార్చి 26న డీజిల్‌పై రూ.21.50, ఏటీఎఫ్‌పై రూ.29.50 ఎగుమతి సుంకం విధించగా, ఏప్రిల్‌ 11న జరిగిన సమీక్షలో వాటిని వరుసగా రూ.55.50, రూ.42కు పెంచిన విషయం తెలిసిందే.

Read Also : థ్యాంక్స్‌ సీఎం రేవంత్‌..! సీఎం రేవంత్‌ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్‌ పాలాభిషేకం..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »