Fuel Prices Rise | అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో మాత్రం తక్కువగానే ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సుమారు 76 రోజుల తర్వాత ప్రభుత్వరంగ చమురు సంస్థలు దశలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దేశంలో లీటర్ పెట్రోల్పై సుమారు రూ.4.74, డీజిల్పై రూ.4.82 వరకు పెరిగాయి. అయినా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో భారత ప్రజలపై తక్కువ భారం పడేలా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 5శాతం వరకు పెంచాయి.
Read Also : మూడోసారి పెరిగిన పెట్రోల్ ధర.. ఈ సారి ఎంత పెంచారంటే..?
ఏ దేశాల్లో ఎంత పెరిగాయంటే..?
అయితే, పలుదేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. మయన్మార్లో పెట్రోల్ ధర దాదాపు 90శాతం, డీజిల్ ధరలు 112శాతం పెరిగాయి. మలేషియాలో రేట్లు పెట్రోల్ 56శాతం, డీజిల్ 71శాతం వరకు ఎగబాకాయి. యాదాది దేశం పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు 55 శాతం, డీజిల్ ధరలు 45 శాతం పెరిగాయి. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ గణనీయంగానే ఇంధన ధరలు పెరిగాయి. యూఎస్లో పెట్రోల్ ధర 44.5, డీజిల్ 48.11 శాతం, యూఎస్లో పెట్రోల్ 19శాతం, డీజిల్ ధర 34శాతం కంటే ఎక్కువగానే పెరిగింది. ఫ్రాన్స్లో పెట్రోల్పై 21శాతం, డీజిల్పై 31 వరకు ధరలు పెంచాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో నెలకొన్న అస్థిరతే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం.. నిజామాబాద్లో అత్యధికంగా 45.7 డిగ్రీలు..
రూపాయి పతనంపై పీయూష్ గోయల్ కామెంట్స్..
రూపాయి విలువ పతనంపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పందించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువలో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల ఆధారంగానే రూపాయి విలువ నిర్ణయించబడుతుందని చెప్పారు. ఎగుమతులను పెంచడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత రెండు మూడు రోజులుగా రూపాయి మళ్లీ బలపడుతోందని, ఇది మార్కెట్లో సహజ ప్రక్రియలో భాగమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగితే భారత్లో కూడా ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ, సామాన్య ప్రజలపై భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also : ధాన్యానికి అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం


