చెన్నై: ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ (Anywhere Registration) పేరుతో కొత్త ఆన్లైన్ సేవలను ఆదివారం ప్రారంభించింది. ఈ విధానం ద్వారా పౌరులు ఇకపై సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లకుండానే ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డాక్యుమెంట్లను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో ఖాతా సృష్టించి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత సబ్-రిజిస్ట్రార్ డాక్యుమెంట్ను పరిశీలించి ఆమోదించిన తర్వాత, డిజిటల్ సంతకంతో కూడిన రిజిస్ట్రేషన్ పత్రం వినియోగదారుడి ఖాతాకు పంపబడుతుంది. అంతేకాకుండా నమోదిత మొబైల్ నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా పంపనున్నారు.
ఈ సేవ కింద మొదటి విక్రయానికి సంబంధించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలు, అపార్ట్మెంట్లు లేదా ఫ్లాట్ల మొదటి సేల్ డీడ్లు, తమిళనాడు హౌసింగ్ బోర్డు విక్రయ పత్రాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన మార్ట్గేజ్ మరియు రసీదు పత్రాల రిజిస్ట్రేషన్కు అనుమతి ఇవ్వబడింది.
ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ సంస్కరణతో ప్రజల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతుందని అధికారులు తెలిపారు.
ప్రజలకు ఇంటి వద్ద నుంచే సేవలు అందించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవనుందని భావిస్తున్నారు.


