Vijay TVK
తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (Vijay TVK) పార్టీ తమ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఆదివారం చెన్నైలో జరిగిన భారీ సభలో విజయ్ స్వయంగా ఈ జాబితాను ప్రకటించారు. ముఖ్యంగా ఆయన రెండు కీలక స్థానాలైన పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
వాటి మధ్యే ప్రధాన పోటీ..
ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్, తమ పార్టీ అభ్యర్థులను “ప్రజల రక్షకులు”గా అభివర్ణించారు. “ఇవాళ బరిలోకి దిగుతున్న వారు రాజకీయ దిగ్గజాలు కాకపోవచ్చు, కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండే నాయకులు” అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే మరియు Vijay TVK మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
విజిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని, అవినీతికి చోటు ఉండదని హామీ ఇచ్చారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, తమిళనాడును డ్రగ్స్రహిత రాష్ట్రంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. “రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక్కసారి అవకాశం ఇవ్వండి” అని ప్రజలను కోరారు.
టీవీకే ప్రభావం ఎలా ఉంటుందో..
ఇక మరోవైపు అధికార పార్టీ డీఎంకే కూడా తమ ఎన్నికల వ్యూహాన్ని వేగవంతం చేసింది. మొత్తం 234 స్థానాల్లో 164 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, మిగతా 70 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేయనుండగా, DMDKకు 10, VCKకు 8, సీపీఐ మరియు సీపీఎంలకు చెరో 5 స్థానాలు కేటాయించారు. ఇతర చిన్న పార్టీలకు మిగతా స్థానాలు ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు. ఈసారి కొత్త పార్టీగా TVK ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
Also Read: దేశ రాజకీయాల్లో భారీ మార్పులు.. లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన


