Nalgonda : నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా చేపట్టనున్న ఎస్ఐ, పీసీ రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్న అర్హత కలిగిన 500 మంది యువతీ యువకులను ఎంపిక చేసి నల్గొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ శిక్షణలో ఫిజికల్ ఫిట్నెస్, రాత పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్, మాక్ టెస్టులు, పరీక్షకు సంబంధించిన గైడెన్స్, నిపుణుల సూచనలతో శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు నిపుణుల మార్గదర్శకత్వం అందించనున్నారు. మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా వసతి సౌకర్యం కల్పించనున్నారు.
Free Training for SI & Police Constable Aspirants – Nalgonda District Police.
Nalgonda District Police, under the guidance of SP Shri Sharath Chandra Pawar, IPS, is providing free training to 500 eligible unemployed youth preparing for the upcoming Telangana Police SI and… pic.twitter.com/raZWYphnpg
— Nalgonda District Police (@NalgondaCop) September 18, 2026
ఈ ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 20, 2026 ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్కు హాజరు కావచ్చు.
స్క్రీనింగ్ టెస్ట్కు హాజరయ్యే అభ్యర్థులు గూగుల్ ఫారమ్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అలాగే తెలంగాణ పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు దరఖాస్తు చేసిన పార్ట్-1 అప్లికేషన్ ఫారమ్ ప్రతిని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని అభ్యర్థులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. పరీక్ష జరిగే రోజు ఉదయం 9 గంటలకు కేంద్రాలకు చేరుకుంటే అక్కడ ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్లలో తమ పేర్లు నమోదు చేసుకుని నేరుగా స్క్రీనింగ్ టెస్ట్కు హాజరు కావచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించి సహాయం పొందవచ్చని సూచించారు.
నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని అభ్యర్థులకు ఎన్.జీ. కాలేజ్, నల్గొండలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ అభ్యర్థులకు మీన ఇంజినీరింగ్ కాలేజ్, మిర్యాలగూడలో పరీక్ష ఉంటుంది. దేవరకొండ సబ్ డివిజన్ అభ్యర్థులకు డిండి క్రాస్ రోడ్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్, మీనాక్షి సెంటర్స్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఎంపికైన 500 మంది అభ్యర్థులకు నల్గొండ పోలీస్ శాఖ ఉచితంగా శిక్షణ అందించనుంది. వసతి, భోజనంతో పాటు ఇండోర్, ఔట్డోర్ శిక్షణ, ఎగ్జామ్ గైడెన్స్, ఎక్స్పర్ట్ గైడెన్స్ అందించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
పోలీస్ ఉద్యోగాల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ జిల్లా పోలీస్ శాఖ కోరింది.
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/Ha8ZK33Y1emVCKmx6


