Srisailam | దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం క్షేత్రాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు దేవస్థానం పాలకవర్గం కార్యాచరణను వేగవంతం చేసింది. తిరుమలలో ఉన్న తరహాలో ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం శ్రీశైలం పరిపాలన భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి ప్రత్యేక సమావేశంలో భక్తుల సౌకర్యాలు, క్షేత్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి వచ్చిన పలు ప్రతిపాదనల్లో కొన్నింటికి ఆమోదం లభించగా.. మరికొన్నింటిని వాయిదా వేశారు.
Read Also : శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్.. మూడురోజులు గర్భాలయ దర్శనాలు బంద్..!
సమావేశంలో మాట్లాడిన అధ్యక్షుడు రమేశ్ నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని శ్రీశైలంలో విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న ప్రత్యేక యోగా కార్యక్రమంతో పాటు జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. స్థానికులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. క్షేత్ర పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు వర్షాకాలంలో భారీ స్థాయిలో మొక్కల నాటకం చేపట్టాలని నిర్ణయించారు. కనీసం ఐదు నుంచి ఆరు వేల మొక్కలను నాటేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నీడనిచ్చే వృక్షాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన దేవతా వృక్షాలను కూడా నాటాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Read Also : ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్..! డైట్ ఛార్జీల పెంపు దిశగా ప్రభుత్వం అడుగులు..!
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తరహాలో అత్యాధునిక ‘పిలిగ్రిమ్స్ అమినిటీస్ కాంప్లెక్స్’ నిర్మాణానికి రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, దర్శన వ్యవస్థను మరింత సులభతరం చేసే చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. క్షేత్రంలో పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని సభ్యులు సూచించారు. అదే సమయంలో దేవస్థానం ఆధ్వర్యంలోని దత్తత ఆలయం జ్యోతి సిద్ధవటంలో సేవలందిస్తున్న సిబ్బంది పారితోషికాన్ని పెంచాలని తీర్మానించారు. భక్తులకు మెరుగైన సేవలు, ఆధునిక సదుపాయాలు, పర్యావరణ హిత అభివృద్ధి లక్ష్యంగా శ్రీశైలం దేవస్థానం ముందుకు సాగుతోందని సమావేశం ద్వారా స్పష్టమైంది. రానున్న రోజుల్లో శ్రీశైలం రూపురేఖలు మరింత మారే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : త్వరలో అందుబాటులోకి భోగాపురం ఎయిర్పోర్ట్.. ఎలక్ట్రిక్ బసులు నడిపేందుకు ఆర్టీసీ ప్లాన్..!


