Srisailam Temple | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక అలెర్ట్ జారీ చేశారు. భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశాల నేపథ్యంలో శనివారం నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. వారాంతపు సెలవులు, వేసవి సెలవుల ముగింపు దశ కలిసి రావడంతో ఈ మూడు రోజులు ఆలయంలో అసాధారణ రద్దీ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. ముఖ్యంగా స్పర్శ దర్శనాల కోసం వచ్చే వీఐపీ బ్రేక్ సదుపాయాలను తాత్కాలికంగా నిలిపివేయడం ద్వారా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.
Read Also : తెలంగాణ మహిళలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రూ.10లక్షల దాకా వడ్డీ లేని రుణాలు..!
మూడురోజులు అలంకార దర్శనాలే..
ఈ మూడు రోజుల పాటు భక్తులకు కేవలం ‘అలంకార దర్శనం’ మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో చెప్పారు. అంటే స్వామివారిని దూరం నుంచే దర్శించుకోవాల్సి ఉంటుంది. గర్భగుడిలోకి ప్రవేశం, శివలింగాన్ని స్పర్శించే అవకాశం సాధారణ భక్తులకు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో శ్రీశైలానికి వచ్చే భక్తులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు మార్చుకోవాలని సూచించారు. అయితే, ఇప్పటికే ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం ఈ నిర్ణయం వర్తించదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అధికారిక వెబ్సైట్లో ముందస్తుగా టికెట్లు పొందిన వారు తమకు కేటాయించిన సమయానికే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేక దర్శనాల కోసం సిఫార్సు లేఖలతో వచ్చే వారికి మాత్రమే ఈ పరిమితులు అమల్లో ఉంటాయని దేవస్థానం వర్గాలు వివరించాయి.
Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, మజ్జిగ, పాలు నిరంతరం అందించేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు సేవా సిబ్బందిని కూడా నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య ఏర్పాట్లను మరింత బలోపేతం చేశారు. ఇక ప్రసాదాల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా అదనపు లడ్డూ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రత్యేక క్యూ నిర్వహణ బృందాలు పనిచేయనున్నాయి. ఆలయానికి వచ్చే వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు సిబ్బంది సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆలయ అధికారుల సూచనలు పాటించి సహకరించాలని ఈవో కోరారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో శ్రీశైలానికి వచ్చే వారు ముందుగానే దర్శన సమయాలు, టికెట్ వివరాలు తెలుసుకుని రావడం మంచిదని సూచించారు. భక్తుల రద్దీ తగ్గిన అనంతరం సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం నుంచి తిరిగి సాధారణ స్పర్శ దర్శనాలను పునరుద్ధరించే అవకాశం ఉందని దేవస్థానం వర్గాలు తెలిపాయి. పరిస్థితిని సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
Read Also : భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించనున్న ప్రధాని.. జులై నుంచి సర్వీసులు షురూ..!


