Harmanpreet Kaur | ప్రపంచ మహిళల క్రికెట్లో ఇప్పటికే వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు మరో చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. తొలిసారి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ (ICC Women’s T20 World Cup) గెలిచి, తమ ఖాతాలో మరో గ్లోబల్ టైటిల్ను చేర్చుకోవాలన్న లక్ష్యంతో టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ జూన్ 12 నుంచి ఇంగ్లాండ్, వేల్స్లో ప్రారంభం కానుంది. గతేడాది స్వదేశంలో టీ20 ప్రపంచకప్ విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత జట్టు, ఈసారి ఇంగ్లాండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇటీవల అదే ఇంగ్లాండ్పై వైట్బాల్ సిరీస్లో సాధించిన విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
Read Also : పర్యాటక రంగానికి ‘డిజిటల్’ బూస్టర్.. తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు అయితే ఇంగ్లాండ్ ఓ సాధారణ పర్యటన కాదు. 2009లో ఇదే ఇంగ్లాండ్లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లోనే ఆమె భారత జట్టులో అరంగేట్రం చేసింది. ఇప్పుడు అదే నేలపై మరో ప్రపంచకప్ కోసం సిద్ధమవుతుండటంతో ఈ ప్రయాణం ఆమెకు మరింత ప్రత్యేకంగా మారింది. చెమ్స్ఫోర్డ్లో జరిగిన ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశంలో హర్మన్ప్రీత్ తన భావోద్వేగాలను షేర్ చేసుకుంది. “ఇంగ్లాండ్లోనే అరంగేట్రం చేసి, అదే దేశంలో ప్రపంచకప్ గెలవడం ఏ క్రికెటర్కైనా కలలాంటిది. అది నెరవేరితే అంతకంటే ఎక్కువగా నేను ఏమీ కోరుకోను” అని వ్యాఖ్యానించింది. సానుకూల ఆలోచనలతో స్థిరంగా ముందుకు సాగడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. “మేము ప్రతిసారి సరైన పనులు చేస్తూ, స్థిరత్వాన్ని కొనసాగించాలి. అదే ఫలితాలను ఇస్తుంది. మైదానంలోకి వెళ్లి స్వేచ్ఛగా ఆడి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి” అని హర్మన్ప్రీత్ చెప్పింది.
Read Also : రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం.. భావోద్వేగానికి గురైన హేమమాలిని..!
ఇప్పటివరకు జరిగిన అన్ని మహిళల టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో ఆడిన ఏకైక భారత ఆటగాళ్లలో హర్మన్ప్రీత్ కౌర్ ఒకరు కావడం విశేషం. ఆమె కెరీర్లో ఇది పదో ప్రపంచకప్ కావడం విశేషం. ఇక ఇటీవల భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడం కూడా జట్టుకు పెద్ద బూస్ట్గా నిలిచింది. అదే ఆత్మవిశ్వాసంతో ఈ టీ20 ప్రపంచకప్లోకి అడుగుపెడుతున్నామని కెప్టెన్ తెలిపారు. “ప్రపంచకప్ విజయం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒత్తిడిలో ఎలా ఆడాలో మాకు తెలుసు. మేము ఏం బాగా చేశామో స్పష్టంగా తెలుసు. ఆ అనుభవం ఈ టోర్నీలో మాకు ఎంతో ఉపయోగపడుతుంది” అని ఆమె పేర్కొన్నది. గ్రూప్-1లో భారత్కు కఠినమైన పోటీ ఎదురుకానుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో మే 28 నుంచి ఇంగ్లాండ్తో జరిగే ద్వైపాక్షిక సిరీస్తో భారత ప్రచారం మొదలవుతుంది. టోర్నీకి ముందు భారత్ జూన్ 8న వెస్టిండీస్తో, జూన్ 10న ఇంగ్లాండ్తో వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. అనంతరం జూన్ 14న ఎడ్జ్బాస్టన్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే మ్యాచ్తో భారత్ తన ప్రపంచకప్ టోర్నీని ప్రారంభించనుంది.
Read Also : ఎంజేపీ గురుకులాలకు ‘బ్రాండ్ ఇమేజ్’ తప్పనిసరి : మంత్రి పొన్నం ప్రభాకర్


